Amith Shah: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తరువాతనే దేశానికి స్వతంత్ర భద్రతా విధానం దక్కిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రుస్తాంజీ మెమోరియల్ లెక్చర్ కార్యక్రమంలో భాగంగా సరిహద్దు భద్రతా దళ సిబ్బంది, అధికారులతో మాట్లాడిన అమిత్ షా..పలువురు సైనికులు, సరిహద్దుల్లో వీర మరణం పొందిన జవాన్లకు గ్యాలంట్రీ మెడల్స్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే వరకూ ఈ దేశానికి భద్రతా విధానం ఉందా అంటే సందేహమేనన్నారు. అప్పటి వరకూ మనకు స్వతంత్ర భద్రతా విధానం లేదన్నారు. మోడీ వచ్చిన తరువాత దేశానికి స్వతంత్ర భద్రతా పాలసీ వచ్చిందన్నారు. అందరితో శాంతియుత సంబంధాలు కలిగి ఉండాలనేదే ఈ ప్రభుత్వ ఆలోచన అని కానీ ఎవరైనా మన సరిహద్దులను మార్చే ప్రయత్నం చేస్తే మన సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తే అదే స్థాయిలో సమాధానమివ్వటమే మన భధ్రతా విధాన లక్ష్యమని అన్నారు. స్వతంత్ర భద్రతా విధానం లేకుండా దేశం అభివృద్ధి చెందదనీ అలాగే ప్రజాస్వామ్యం విరాజిల్లదనీ, దానిని మోడీ సాధించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం మూడు శాతం మేర కంచె లేకుండా ఉన్న సరిహద్దులు చొరబాటు దారులకు అనుకూలంగా మారుతున్నాయనీ, వచ్చే ఏడాది నాటికి దేశ సరిహద్దులను కంచెతో మూసివేస్తామని షా స్పష్టం చేశారు. జమ్మూ వాయుసేన స్థావరంపై డ్రోన్ దాడి జరిగిన 20 రోజుల తరువాత అమిత్ షా ఈ విషయంపై స్పందించారు. స్వదేశీ యాండీ డ్రోన్ సాంకేతికతను అభివృద్ధి చేయటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యతమని అన్నారు. ఆ దిశగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) పని చేస్తోందని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన అన్ని పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. కృత్రిమ మేథ వినియోగించేందుకు బీఎస్ఎఫ్ అధికారులు సిద్ధంగా ఉండాలనీ. ఉగ్రవాదులు, స్మగ్లర్లు సృష్టించే సమస్యలకు పరిష్కారానికి నిపుణులతో భాగస్వామ్యమై పని చేయాలని పిలుపునిచ్చారు.