అధికారంలోకి రావడం కోసం రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో ఎన్నో రకాల హామీలను ఇస్తుంటారు. అది సహజం. ఎన్నికల సమయంలో నేతలు ఇచ్చే హామీలో కొన్ని తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. ఫలితాలు ఇస్తూనే ఉంటాయి. ఇప్పుడు తమిళనాట కమల్ హాసన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు సంచలన హామీలు ఇస్తున్నారు.
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయం అయ్యింది.ఈ నెలాఖరున రజనీ పార్టీ పేరును ప్రకటించనున్నారు. మరో పక్క మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్ హసన్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ విభాగాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే కమల్ హసన్ తన పర్యటనలో సంచలన ప్రకటనలు, హామీలు ఇస్తున్నారు. ఇటీవల ఓ సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మధురైని రాష్ట్రానికి రెండవ రాజధానిగా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో ఆ ప్రాంత ప్రజల మనసును గెలుచుకోవాలని కమల్ హాసన్ ప్రయత్నం చేశారు.
ఇప్పుడు తాజాగా కమల్ మరో సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కేబినెట్లో 50 శాతం మంది మహిళా నేతలకు అవకాశం కల్పిస్తాని హామీ ఇచ్చారు. కేబినెట్ లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలనేది తన కల అని, మక్కల్ నీది మయ్యమ్ అధికారంలోకి వస్తే అది సాకారం అవుతుందని పేర్కొన్నారు కమల్ హాసన్. ప్రస్తుతం తమిళనాడు మంత్రివర్గంలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో 234 నియోజకవర్గాలు ఉండగా ప్రస్తుతం కేవలం 20 మంది మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రివర్గంలో మహిళలు నలుగురే ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ సమాజంలో మార్పు మహిళల వల్లనే సాధ్యమని కమల్ పేర్కొన్నారు. కమల్ హాసన్ ప్రకటించిన ఈ హామీకి మహిళామణులు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాలి.