Assembly Elections 2021 : దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. పశ్చిమ బెంగాల్, కేరళతో సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగింది. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా కొద్దిసేపటి క్రితం ఈ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యుల్ ప్రకటించారు. ఈ సందర్భంగా అరోరా మాట్లాడుతూ కరోనా జాగ్రత్తలతో ఎన్నికలకు సిద్దమవుతున్నామని పేర్కొన్నారు. నేటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్లు ఈసీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ లో 294, తమిళనాడులో 234, కేరళలో 140, అసోంలో 126, పుదుచ్ఛేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయిదు రాష్ట్రాల్లో 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నది. ఈ రాష్ట్రాల్లో మొత్తం 18,68కోట్ల ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా వెల్లడించారు.
అసోంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఇసీ తెలిపింది. మార్చి 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ ల దాఖలు గడువు మార్చి 9వ తేదీ. 10న నామినేషన్ల పరిశీలన, మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న అసోంలో ఎన్నికలు. మే 2న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి.
కేరళ, తమిళనాడు, పాండిఛ్చేరి రాష్ట్రాల్లో ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్, మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది విడతల్లో పోలింగ్ కు షెడ్యుల్ ప్రకటించింది. మార్చి 27,ఏప్రిల్ 1, ఏప్రిల్ 6, ఏప్రిల్ 10, ఏప్రిల్ 17, ఏప్రిల్ 22, ఏప్రిల్ 26, ఏప్రిల్ 29 తేదీల్లో పోలింగ్ జరగనున్నది. కాగా వివిధ రాష్ట్రాలలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల ఉప ఎన్నికలకు వేరే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఇసి తెలిపింది.
ఇప్పటికే కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రాల్లో పర్యటించింది. ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీలతో ఈసి చర్చించింది. ఎన్నికల సన్నద్ధత, శాంతి భద్రతలు, తదితర అంశాలపై ఈసీ అధికారులతో సమీక్ష జరిపింది.