Assembly Elections 2022: దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్దత నెలకొన్న విషయం తెలిసిందే. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందన్నందున ఎన్నికల వాయిదా వేయాలంటూ ఇటీవల అలహాబాద్ హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితో ఈసీ సమావేశం అయ్యింది. మరో పక్క ఉత్తర ప్రదేశ్ లో పర్యటించి రాజకీయ పార్టీ నేతలతో భేటీ నిర్వహించి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను తీసుకుంది. ఎన్నికల నిర్వహణకే రాజకీయ పార్టీలు మొగ్గు చూపాయి.
Assembly Elections 2022: షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు
ఎన్నికల నిర్వహణపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశిల్ చంద్ర స్పష్టం చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తుది ఓటర్ల జాబితా జనవరి 5వ తేదీ విడుదల చేస్తామని ఆయన చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీ ప్యాట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా లైవ్ వెబ్ కాస్టింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సుశిల్ చంద్ర వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఈసి పలు సూచనలు చేసింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలని తెలిపింది.
జనవరి నెలలో షెడ్యుల్..?
ఈసీ ఇచ్చిన క్లారిటీతో యుపీతో సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలకు జనవరి నెలలో షెడ్యుల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ శాసనసభల పదవీ కాలం వచ్చే మార్చిలో ముగియనుండగా, యూపీ అసెంబ్లీ గడువు మే నెల వరకూ ఉంది. కరోనా పరిస్థితులపై ఆరోగ్య శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఎన్నికల తేదీ ప్రకటన అనంతరం కోవిడ్ దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకాలను జారీ చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశిల్ చంద్ర చెప్పారు.