ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ఈడీ అరెస్టు చేసిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్ధా చటర్జీపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేటు వేశారు. మంత్రి చటర్జీని బర్తరఫ్ చేయాలంటూ ప్రతిపక్షాల నుండి తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ఆయనను మంత్రి వర్గం నుండి తొలగించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వాణిజ్య, ఐటీ శాఖ బాధ్యతలను ఇకపై తాను చేపడతానని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఇలాంటి వ్యవహారాల్లో తమ పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అయితే దీని వెనుక చాలా కుట్రలు ఉన్నాయనీ, వాటి వివరాల్లోకి ప్రస్తుతం వెళ్లబోనని మమతా బెనర్జీ తెలిపారు. మమతా బెనర్జీ ప్రకటనకు ముందు మంత్రి పార్ధా చటర్జీని బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ కోల్ కతాలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకంత మజుందార్ .. టీఎంసీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.
అవినీతి ఆరోపణలతో అరెస్టు అయిన అయిదు రోజుల తరువాత మంత్రి చటర్జీపై వేటు పడింది. ఈ నెల 23వ తేదీన కోల్కతాలో మంత్రి చటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నివాసం నుండి ఈడీ అధికారులు రూ.21 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. పార్ధా చటర్జీ, అర్పితా ముఖర్జీలను అరెస్టు చేసిన ఈడీ అధికారులు అర్పిత నుండి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో బుధవారం నాడు అర్పితకు చెందిన రెండవ ఫ్లాట్ లో మరో 29 కోట్ల నగదు, అయిదు కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా దర్యాప్తునకు ఉపయోగపడే కీలకమైన డాక్యుమెంట్లను సైతం సేకరించారు. ఈ సమయంలో మంత్రి పార్ధ చటర్జీకి చెందిన మరిన్ని ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తొంది. రాజ్ దంగాలోనూ అర్పితా ముఖర్జీకి మరో ఫ్లాట్ ఉన్నట్లు సమాచారం. అర్బితా ముఖర్జీ నివాసాల్లో స్వాధీనం చేసుకున్న నగలు, నగదు, కీలక డాక్యుమెంట్లను పది ట్రంక్ పెట్టెల్లో ఉంచి డీసీఎం వ్యాన్ లో తరలించారు ఈడీ అధికారులు. తన ఇంట్లో లభించిన ఆ డబ్బు అంతా మంత్రి చటర్జీదేనని అర్పితా ముఖర్జీ ఈడీ అధికారుల వద్ద ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అర్పితా ముఖర్జీ స్టేట్ మెంట్ తో చటర్జీకి ఉచ్చు బిగుసుకుంటోంది.
ఈ ఉదయమే మంత్రి చటర్జీ వ్యవహారంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే చటర్జీని మంత్రివర్గం నుండి, పార్టీ పదవుల నుండి, టీఎంసీ నుండి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక వేళ తన వ్యాఖ్యలు తప్పు అయితే తనను అన్ని పదవుల నుండి తొలగించే హక్కు పార్టీకి ఉందని చెప్పారు కునాల్ ఘోష్. తాను టీఎంసీ సైనికుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు కునాల్ ఘోష్ ట్విట్ చేశారు. ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదురుకావడంతో పాటు స్వపక్షంలోని నేతలు కూడా చటర్జీపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తొంది.