నూతన సాగు చట్టాలపై రైతులతో చర్చల కోసం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నుండి భారతీయ కిసాన్ సంఘం (బీజెయూ) అధ్యక్షుడు భూపీందర్ సింగ్ మాన్ తప్పుకున్నారు. ఈ ప్యానెల్ నుండి తనకు తానుగా తప్పుకుంటున్నట్లు మాన్ ప్రకటించారు. ఈ కమిటీలో సభ్యుడిగా తనను నామినేట్ చేసినందుకు ముందుగా సుప్రీం ధర్మాసనానికి మాన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ..రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఎలాంటి పదవినైనా త్యాగం చేసేందుకు సిద్ధమేనని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సాగు చట్టాల అమలుపై మంగళవారం సుప్రీం కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. సమస్య పరిష్కారానికి అంటూ సుప్రీం కోర్టు రైతులతో సంప్రదింపులు జరిపేందుకు గానూ అనిల్ ఘన్వాట్, అశోక్ గులాటి, భూపేందర్ సింగ్ మాన్, ప్రమోద్ కుమార్ జోషిలతో కూడిన కమిటీని నియమించింది. పది రోజుల్లో తొలి సమావేశం నిర్వహించాలని సుప్రీం కోర్టు సూచించింది.
అయితే ఈ కమిటీలోని నలుగురు సభ్యులు నూతన వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా గతంలో మాట్లాడారనీ రైతు సంఘాలు, విపక్షాలు తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశాయి. కమిటీల వల్ల ప్రయోజనం ఏమీ లేదనీ, ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేేయాల్సిందేననీ, అప్పటి వరకూ తమ ఉద్యమం విరమించేది లేదనీ రైతుల సంఘాల ప్రతినిధులు తేగేసి చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..16నుండి కరోనా వ్యాక్సిన్ పంపిణీ. తొలి రోజు ఎంత మందికో తెలుసా