అమెరికా 46వ అధ్యక్షుడుగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జో బైడెన్ తో ప్రమాణం చేయించారు. భారత కాల మానం ప్రకారం బుధవారం రాత్రి 10.20 గంటలకు జో బైడెన్ నూతన అధ్యక్షుడుగా ప్రమాణం చేశారు. తొలుత అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ప్రమాణం చేశారు. బైడెన్ ప్రమాణ స్వీకారానికి డోనాల్డ్ ట్రంప్ గైర్హజరయ్యారు.
అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జో బైడెన్ ప్రసంగిస్తూ ఆమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందన్నారు. ఇది అమెరికా ప్రజలందరి విజయమని పేర్కొన్నారు. క్యాపిటల్ హిల్ హింసతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందని భయపడ్డారని కానీ ఆమెరికా ప్రజలు విజయం సాధించారని అన్నారు. ఆమెరికాలో ప్రజాస్వామ్యం చాలా బలంగా ఉందని జోబైడెన్ పేర్కొన్నారు. ఆమెరికా ఎన్నో సవాళ్లు అధిగమించిందన్నారు.
రేసిజంపై రాజీలేని పోరు చేస్తామన్నారు. యుద్దం కన్నా శాంతిని కోరుకుంటున్నామని అన్నారు. ప్రతి ఒక్క అమెరికా పౌరుడితో కలిసి పని చేస్తామన్నారు. నాలుగేళ్లలో ఆమెరికా ప్రజలు అరాచకాన్ని చూశారని ట్రంప్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఆమెరికా ప్రజలందరూ ఐకమత్యంతో ఉన్నప్పుడే అబివృద్ధి సాధ్యమని అన్నారు. క్యాపిటల్ హిల్ లాంటి ఘటనలు ఎప్పటికీ పునరావృత్తం కావని హామీ ఇచ్చారు జో బైడెన్. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదనీ, కరోనాని తరిమికొట్టడమే తమ ప్రధమ లక్ష్యమని జో బైడెన్ పేర్కొన్నారు.