బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవేళ ఉదయం 11 గంటలకు నితీష్ కుమర్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. గత కొంత కాలంగా బీజేపీతో సన్నిహితంగా వ్యవహరిస్తూ నితీశ్ వ్యవహారాల శైలిపై విమర్శలు చేస్తున్న సీనియర్ జేడీ (యూ) నేత ఆర్సీపీ సింగ్ రాజీనామా చేయడంతో నితీశ్ అలర్ట్ అయ్యారు. మహారాష్ట్ర లో శివసేన మాదిరిగా బీహార్ జేడీ (యూ)లోనూ బీజేపీ చీలిక తేవడానికి ప్రయత్నిస్తొందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో నితీష్ కుమార్ రీసెంట్ గా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఫోన్ లో మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏ నుండి నితీశ్ కుమార్ (జేడీ యూ) బయటకు వచ్చినా యూపీఏ తో జత కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఎన్డీఏ నుండి నితీశ్ బయటకు వస్తే వారితో జత కట్టడానికి తాము సిద్దమేనని ఆర్ జే డీ జాతీయ ఉపాధ్యక్షుడు శివానంద తివారీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆర్ జే డీ నేడు తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అటు నితీశ్ ఆధ్వర్యంలో జేడీ (యూ), ఇటు ఆర్ జేడీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీహార్ లో ఎన్డీఏకి నితీశ్ దూరం అవుతున్నారన్న సంకేతాలు రావడంతో కేంద్రంలోని బీజేపీ అప్రమత్తమైంది. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నితీశ్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడినట్లు ఓ ప్రముఖ జాతీయ ఛానల్ పేర్కొంది. అమిత్ షా ఫోన్ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
బీజేపీ నుండి జేడీయు విడిపోయి ఆర్జేడీ, కాంగ్రెస్ తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత బీహార్ అసెంబ్లీలో ఆర్డీడీకి 77 సీట్లు, కాంగ్రెస్ కు 19, వామపక్షాలకు 16 సీట్లు (మహా కూటమి 115) సీట్లు ఉన్నాయి. అధికార ఎన్డీఏ కూటమికి 127 సీట్లు ఉన్నాయి. ఇందులో బీజేపీకి 77 సీట్లు, జేడీయూకి 45, హిందూస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ 4, లోక్ జనశక్తి పార్టీకి 1 సీట్లు ఉన్నాయి. సీఎం నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్న జేడీయు కీలక సమావేశంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నితీశ్ ఎన్డీఏకి కటీఫ్ చెప్పి మహాకూటమితో జత కడతారా లేదా అనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది.