BJP : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయ వాతావరణం రోజురోజు వేడెక్కుతోంది. రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవాలని తృణముల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ, ఎలాగైనా పశ్చిమ బెంగాల్ లో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని బీజెపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. బలమైన నేతలను తమ వైపుకు తిప్పుకోవాలని ఇరుపార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికార టిఎంసీలో అసమ్మతి నేతలకు బీజేపీ గాలం వేస్తూ సఫలం అవుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజెపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆ రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు.
తాజాగా శనివారం బీజెపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ బీజెపీ ఉపాధ్యక్షుడు ముకల్ రాయ్ ఆధ్వర్యంలో టిఎంసీ మాజీ మంత్రి రాజీవ్ బెనర్జీ, మాజీ హౌరా మేయర్ రతిన్ చక్రవర్తి, నేతలు బైషాలీ దాల్మియా, ప్రబీర్ గోపాల్, రుద్రనిల్ ఘోష్ లు ఢిల్లీకి చేరుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయి సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం వీరు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అమిత్ షా ట్విట్టర్ వేదికగా స్పందించారు. వీరి చేరికతో బీజెపీ బలం మరింత పెరిగిందని ట్వీట్ చేశారు. బెంగాల్ ను బంగారంగా మార్చేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు అమిత్ షా. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారధి, నటి రుద్రాణి ఘోష్ తదితరులు ఉన్నారు.