BJP: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అండతో తనపై విమర్శలు గుప్పించే నేతలకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు గులాబీ దళపతి. ఓ వైపు కేసీఆర్ ను ఇరికించేందుకు కమలం పార్టీ నేతలు స్కెచ్ వేసుకొని సిద్ధం అవుతుంటే మరోవైపు అదే సమయంలో వారు అవాక్కయ్యే ఆదేశాలను గులాబీ దళపతి ఇచ్చారు. అదే ఆయుష్మాన్ భారత్ గురించి.
బీజేపీ గేమ్ ప్లాన్
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఎప్పటి నుంచి విమర్శలు ఉన్నాయి.. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ను టార్గెట్ చేశారు బీజేపీ నేతలు.. అసలు ఆయుష్మాన్ భారత్ అమలు చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? అంటూ నిలదీశారు. అంతేకాకుండా, రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్యశ్రీలో కోవిడ్ ట్రీట్ మెంట్ ను చేర్చాలన్న డిమాండ్ తో నేడు రాష్ట్ర బీజేపీ “గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష” చేపడుతోంది. ఈ మేరకు సర్వం సిద్ధం చేసుకుంది. ఈ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కేసీఆర్ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. ఆయుష్మాన్ భారత్ అమల్లో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసిందనే చెప్పాలి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంవోయూ కుదుర్చుకుంది.. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది. ఆయుష్మాన్ భారత్ నియమ నిబంధనలను అనుసరిస్తూ.. రాష్ట్రంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. బీజేపీ నేతల దీక్షకు ముందే కేసీఆర్ భలే గేమ్ ప్లాన్ చేశారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.