TRS: తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది మరింత ముదిరి పాకాన పడింది. అయితే, బీజేపీ తమను ఓ రేంజ్లో ఆడుకునే చాన్స్ టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిందనే టాక్ తెరమీదకు వచ్చింది. ఇదంతా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఈ విషయంలో కేంద్రం స్పందన గురించి!
ఆర్టీఐ సమాధానంతో అడ్డంగా బుక్ ?
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకి ఈ మేరకు రైల్వేశాఖ సమాధానం ఇచ్చింది. దీంతో కేంద్రంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం కేంద్రంలోని బీజేపీకి అలవాటుగా మారిందన్న ఆయన.. ఐటీఐఆర్ ప్రాజెక్టు మాదిరే, కాజీపేట రైల్వే కోచ్ ప్రాజెక్టుకి బీజేపీకి మంగళం పాడుతుందని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని రద్దు చేసే అధికారం బీజేపీకి లేదని, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కు అని కేటీఆర్ తెలిపారు.
ఇక పోరాటమే…
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరారని గుర్తుచేసిన కేటీఆర్ 150 ఎకరాల విలువైన భూమిని సేకరించి కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రానికి రాష్ట్రం ఇచ్చిందన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుంటే వరంగల్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి సైతం తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుందన్నారు. తెలంగాణకు దక్కాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా ఆందోళన చేస్తారన్నారు.
అక్కడితోనే ఆగిపోలేదు…
కేంద్రంపై విరుచుకుపడే విషయంలో కోచ్ ఫ్యాక్టరీతోనే కేటీఆర్ ఆగిపోలేదు. రైల్వేల విషయంలో కేంద్రం రాష్ట్రానికి ప్రతిసారి అన్యాయం చేస్తూనే ఉందని ఆరోపించారు. తాజాగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్లలో రాష్ట్రంలోని పెండింగ్ రైల్వేలైన్ లకు కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. కేంద్రం గొప్పలు చెప్పుకుంటున్న హైస్పీడ్ ట్రైన్, బుల్లెట్ రైలు విషయంలోనూ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయే చూపిందన్న ఆయన.. రైల్వేలను మొత్తం ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. భారత రవాణా వ్యవస్థకు గుండెకాయ అయిన రైల్వేలను ప్రైవేట్ పరం చేయడం జాతి వ్యతిరేక చర్యనే అవుతుందని మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.