BJP: దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిన బెంగాల్ పైనే పడింది. బెంగాల్ రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి అధికం అయి రాష్ట్రం అభివృద్ధికి దూరంగా ఉందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. బెంగాల్ లో విజయం తమదే అని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి అనేకమంది నేతలు ఇప్పటికే బీజేపీలో జాయిన్ అయ్యారు. టిఎంసి… బీజేపీ మధ్య ప్రధాన పోరు జరగబోతోంది. పశ్చిమ బెంగాల్ లో జరగబోతున్న ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు తమ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే, ఈ సమయంలోనే కీలక అప్డేట్ తెరమీదకు వచ్చింది.
టార్గెట్ సీఎం …
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగ్రామ్ నియోజక వర్గంపైనే అందరి కళ్ళు ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి మమత తిరిగి పోటీ చేస్తున్న నేపథ్యంలో నందిగ్రామ్ నియోజకవర్గంపై గట్టి పట్టు ఉన్న నేత సువేందు అధికారి ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బరిలో ఉన్నారు. మమతపై పోటీ చేసి 50వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తానని గతంలోనే సువేంధు అధికారి స్పష్టం చేశారు. అధికారి కోరుకున్న విధంగానే నందిగ్రామ్ నుంచి పోటీకి దించుతున్నట్టు బీజేపీ పేర్కొన్నది. మొదటి లిస్ట్ లో ఆయనపేరును ఖరారు చేసింది. దీంతో నందిగ్రామ్ నియోజకవర్గం ఎన్నికలు ఆసక్తిగా మారాయి.
పీకే సంచలన సవాల్…
రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారం సాధించబోదని జోస్యం చెప్పారు. ఒకవేళ బీజేపీ గెలిస్తే తన వృత్తికి గుడ్ బై చెప్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ పూర్తి స్థాయిలో అధికారంలోకి రాలేకపోయినా… మమతను నందిగ్రాంలో ఓడిస్తే అది తమకు భారీ విజయం అవుతుందని బీజేపీ భావిస్తోంది.