BJP : ఎన్నికల సమయంలో అభ్యర్థులు, పార్టీలు గెలుపొందడం కోసం అనేక రకాల హామీలు ఇస్తుంటారు. ఎన్నికల్లో గెలిస్తే అవి ఇస్తాం, ఇస్తాం, ఆ పనులు చేస్తాం, ఈ పనులు చేస్తాం అంటూ అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలకు పెద్ద ఎత్తున వాగ్దానాలు చేస్తుంటారు. ఉచితం అంటూ పథకాలను చెబుతూ ఉంటారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సొంతో సహా కేంద్ర పాలిత ప్రాంతం పుదుఛ్చేరిల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు విస్తృతంగా హామీలను గుప్పిస్తున్నారు. అయితే తమిళనాడులో ఓ సెంటిమెంట్ క్రీడను ఆసరాగా చేసుకుని బీజేపీ ఓ సంచలన హామీ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
తమిళ ప్రజలు జల్లికట్టు క్రీడకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. గతంలో జల్లికట్టు క్రీడపై సుప్రీం కోర్టు నిషేదం విధిస్తే రాష్ట్రం మొత్తం ఒక్కటై పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టారు. ప్రజా ఉద్యమంతో ప్రభుత్వం జల్లికట్టు నిర్వహణకు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. జల్లికట్టు అనేది తమిళనాట ఓ సాంప్రదాయ క్రీడ. ఈ క్రీడలో వేలాది మంది ఉత్సహాంగా పాల్గొంటారు. లక్షలాది మంది ఈ క్రీడలను చూసి ఆనందిస్తుంటారు. ఈ క్రీడ పట్ల తమిళులకు ఉన్న ఆసక్తి, అభిమానాన్ని ఎన్నికల వేళ బీజెపీ క్యాష్ చేసుకోవాలని భావించింది. ఈ క్రమంలో బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో సంచలన హామీ ఇచ్చింది.
జల్లికట్టు ఆడే ఆటగాళ్లకు స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్లు కల్పిస్తామంటూ బీజెపీ ఎన్నికల హామీగా ఇస్తోంది. అయితే ఈ హామీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సుప్రీం కోర్టు నిషేదించిన ఈ సంప్రదాయ క్రీడలో పాల్గొనే క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం అవుతుందా లేదా అనేది పక్కన బెడితే..ప్రతిపక్షాలు దీనిపై ఏ విధంగా స్పందిస్తాయి ? బీజేపీ ఇచ్చిన ఈ హామీకి ఓట్లు రాలతాయా లేదా అనే దానిపై వేచి చూడాలి.