BJP Strategy: శత్రువుకు శత్రువు మిత్రుడు ఒక సామెత. రాజకీయాల్లో ఒక్కో సారి శత్రువు (ప్రత్యర్ధి)ని నేరుగా దెబ్బతీయడం సాధ్యం కాని పరిస్థితుల్లో ప్రత్యర్ధి శత్రువును మిత్రుడు(పొత్తు)గా చేసుకుంటారు. ఇక్కడ ఇద్దరి లక్ష్యం ప్రత్యర్ధికి అధికారం దక్కకుండా చేయడం. ఒక్కోసారి ప్రత్యర్ధి పార్టీ వల్ల కూడా ప్రధాన రాజకీయ పార్టీకి లాభం కల్గించే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దేశంలో బీజేపీ, ఎంఐఎం పార్టీల సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు పార్టీలు మతతత్వ పార్టీలే. ఒక పార్టీ ముస్లిం మతం పునాదులపై నడుస్తుండగా, మరొక పార్టీ హిందూత్వ పునాదులపై ఉంది. ఈ రెండు పార్టీల నేతల ప్రసంగాలు వింటే బద్ధ విరోధులుగా ఉంటాయి. ఆ ప్రసంగాలు విన్న ఆయా పార్టీల క్యాడర్ అంతే శత్రుత్వంతో ఉంటారు. గతంలో హెదరాబాద్ ఓల్డ్ సిటీకే పరిమితమైన ఎంఐఎం పార్టీ దేశంలోని వివిధ రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఈ విస్తరణ క్రమంలో ఆ పార్టీ కొంత మేర బలాన్ని అయితే సంతరించుకుంది కానీ ప్రత్యర్ధి పార్టీకే అధికారం దక్కేలా చేస్తోంది.
BJP Strategy: ఇంతకు ముందు బీహార్ లో..ఇప్పుడు యూపిలో
ఇంతకు ముందు బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ కూటమి ఎంఐఎం కారణమైంది. అయిదు స్థానాల్లో మాత్రం ఎంఐఎం అభ్యర్ధులు గెలుపొందారు. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం ఓట్ల చీలక ప్రభావం బీజేపీ కూటమికి లాభం చేకూర్చింది. ఇప్పుడు యూపిలోనూ అదే పరిస్థితి పునరావృత్తం అయ్యింది. ఉత్తరప్రదేశ్ లో 102 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేసింది. వాస్తవానికి అక్కడ కనీస సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితి ఎంఐఎంకు లేదు. కానీ చిన్న చితకా పార్టీలతో ఎంఐఎం పొత్తు పెట్టుకుని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)కి తీవ్ర నష్టాన్ని కల్గించింది. ఎంఐఎం పోటీ లేకపోతే అక్కడ ముస్లిం వర్గాలు బీజేపీకి ఓటు వేయకుండా ఎస్పీకి ఓటు వేస్తారు. దాదాపు 70 నుండి 90 స్థానాల్లో ఎస్పీ స్వల్ప ఓట్లతో వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. యూపీలో ఓవైసీ కాన్వాయ్ పై జరిగిన కాల్పుల ప్రభావం కూడా ఓట్ల చీలికకు కారణం అయ్యిందని కూడా చెబుతున్నారు.
బెంగాల్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపని ఎంఐఎం
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ ఎంఐఎం రంగంలోకి దిగినా అక్కడ పెద్ద ప్రభావం చూపలేదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఎంఐఎం నేతగా ఉన్న అబ్దుల్ కలాం ఎన్నికలకు ముందు ఎంఐఎం పార్టీకి గుడ్ బై చెప్పి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. బీజేపీకి లాభం చేకూర్చేందుకు ఎంఐఎం పోటీ చేయాలని భావిస్తోందని పేర్కొని ఆయన టీఎంసీలో చేరారు. టీఎంసీ అధినేత మమతా బెనర్జీ కూడా ఇదే విషయాన్ని ఎన్నికల సభలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఎంఐఎంకు ఓటు వేస్తే బీజేపీకి లాభం చేకూర్చినట్లే అవుతుందని విస్తృతంగా అవగాహన కల్పించడంతో టీఎంసీ ఓట్లు పెద్దగా చీలలేదు. ఎంఐఎం ప్రభావం చూపకపోవడంతో పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ మూడవ సారి అధికారంలోకి రాగలిగింది.
యూపీలో పుంజుకున్న ఎస్పీ
వాస్తవానికి యూపిలో యోగి ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే భారీగా సీట్లు తగ్గాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో 312 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఈ ఎన్నికల్లో 250 నుండి 270 స్థానాలు దాటే పరిస్థితి కనబడటం లేదు. గత ఎన్నికల్లో కేవలం 47 స్థానాలతోనే సరిపెట్టుకున్న సమాజ్ వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో 71 స్థానాలు గెలుపొందగా మరో 53 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. ప్రస్తుత ఫలితాల సరళిని చూస్తుంటే ఎంఐఎం చీలిక ఓట్ల వల్లనే యూపీలో సమాజ్ వాదీ పార్టీ అధికారానికి దగ్గర కాలేకపోయిందని అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?