Breaking : దేశంలోని అనేక రాష్ట్రాలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకున్నది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై 45 సంవత్సరాలు అంత కంటే పైబడి వయసు ఉన్నవారందరికీ ఏప్రిల్ 1వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇప్పటి వరకూ 60 సంవత్సరాలు పైబడి వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే 45 నుండి 60 సంవత్సరాల వయసు వారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పుడు వివిధ రాష్ట్రాలలో కేసుల సంఖ్య అధికం అవుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్, నిపుణుల సలహా మేరకు 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జవదేకర్ వెల్లడించారు.
ప్రస్తుతం నడుస్తొన్న టీకా కార్యక్రమంలో ఈ నెల 22వ తేదీ నాటికి 4.85 కోట్ల మందికి ఒక డోస్ వేసుకోగా, 80 లక్షల మంది రెండవ డోస్ టీకాను వేసుకున్నారు.