Breaking: దేశ ద్రోహం చట్టం అమలుపై సుప్రీం కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఈ సెక్షన్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయవద్దనీ, ఇప్పటికే నమోదు అయిన కేసుల్లో చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 124 ఏ పై కేంద్రం పునః పరిశీలన పూర్తి అయ్యే వరకూ ఈ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేయవద్దని చెప్పింది. మానవ హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తొలుత దేశ ద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదో చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దేశ ద్రోహం చట్టాన్ని పునః పరిశీలన చేసే వరకూ కొన్ని చర్యలు తీసుకోవచ్చని, అందు కోసం ప్రభుత్వం నుండి కొన్ని సూచనలను ధర్మాసనం ముందు ఉంచుతున్నట్లు కేంద్రం తరపున హజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. దేశద్రోహ చట్టం కేసులు నమోదు చేయాలంటే ఎస్పీ స్థాయి అధికారి అనుమతి తీసుకోవాలని చెప్పారు. రాజద్రోహం వ్యవహారంలో గుర్తించదగిన నేరం విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు ఆపలేమని కోర్టుకు ఆయన తెలిపారు. దేశ ద్రోహం కేసులు కోర్టుల ముందే పెండింగ్ లో ఉన్నాయనీ, వాటిపై కోర్టులే నిర్ణయం తీసుకోవాలని తుషార్ మెహతా చెప్పారు.
దేశద్రోహానికి సంబంధించిన కేసుల్లో బెయిల్ ధరఖాస్తుపై సత్వర విచారణకు అవకాశం ఉంటుందన్నారు. కాగా బ్రిటీష్ కాలం నుండి వస్తున్న దేశ ద్రోహం చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో లెక్కకు మించి పిటిషన్లు దాఖలు అయి ఉన్నాయి. దేశ ద్రోహం చట్టం కింద 2015 -20 మద్య దేశ వ్యాప్తంగా 356 కేసులు నమోదు అయ్యాయి. దేశ ద్రోహ చట్టం దుర్వినియోగం అవుతోందని కేంద్రమే ఆందోళన చెందుతుంటే ఇక పౌరల హక్కులను ఎలా కాపాడతారు..ఈ చట్టం కింద ఇప్పటికే పలువురు జైళ్లలో ఉన్నారు. ఇంకా ఎందరి మీదో ఈ చట్టం కింద అభియోగాలు మోపనున్నారు అని ధర్మాసనం ఇంతకు ముందు వ్యాఖ్యానించింది.