Budget 2022: నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా వచ్చే 25 సంవత్సరాలను దృష్టి పెట్టుకుని బడ్జెట్ ను ప్రవేశపెట్టామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలోనూ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. వచ్చే అయిదు సంవత్సరాల్లో అరవై లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయమని తెలిపారు. 2021 -2022 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతుందని చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజల సాధికారికత కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ఆర్ధికాభివృద్ధి కొనసాగేలా బడ్జెట్ రూపకల్పన చేశామని చెప్పారు. మొదటి ప్రధాన అంశంగా పీఎం గతి శక్తి పథకాన్ని తీసుకున్నామని నిర్మల చెప్పారు. వృద్ధి రేటు లక్ష్యం 9.2 శాతం అంచనాగా ఉందన్నారు.
Budget 2022: ఎన్ హెచ్ నెట్ వర్క్ 25వేల కిలో మీటర్లకు పెంపు
ప్రధాని గతి శక్తి యోజన, సమీకృత అభివృద్ధి, అభివృద్ధి అధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్ధిక ఊతం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ వేగంగా జరుగుతుందని తెలిపారు. జాతీయ రహదారుల నెట్ వర్క్ ను 25 వేల కిలో మీటర్లకు పెంచుతున్నామనీ, అందుకు 25వేల కోట్లను సమీకరిస్తున్నామని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ తో 16 లక్షల ఉద్యోగాలను సృష్టించుకోగలిగామని నిర్మల అన్నారు. దేశంలో 75 వేల కిలో మీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం లక్ష్యమని నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఈ నదుల అనుసంధానానికి
దేశంలోని పర్వత ప్రాంతాలను కలుపుతూ పీపీపీ పద్ధతిలో పర్వత మాల ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. పేదలకు మౌళిక సదుపాయాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని నిర్మల వివరించారు. దేశంలో నదుల అనుసంధానానికి కృషి చేస్తుందన్నారు. కృష్ణా – గోదావరి, కృష్ణా – పెన్నా, పెన్నా – కావేరీ నదుల అనుసంధానికి ప్రణాళికలను రూపొందించామనీ, తాము అందుకు సహకరిస్తామని మంత్రి నిర్మల తెలిపారు.