Budget 2022: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ పైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ హయాంలో ఇది 10వ బడ్జెట్. ఎప్పటిలానే సామాన్యులు, రైతులు, కార్పొరేట్లు, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలు ఈ బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్నాయి. అందరినీ సంతృప్తి పరచడం ఎలానూ సాధ్యమయ్యేది కాదు. అయితే.. ఈ బడ్జెట్ అనేక సవాళ్ల మధ్య వస్తోంది. రైతు చట్టాలు రద్దు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ బడ్జెట్ వస్తోంది. 2010లో అప్పటి ఆర్ధికశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్టు.. బడ్జెట్ అంటే అంకెలు, లెక్కలు మాత్రమే కాదు.. ప్రభుత్వ విధానాలను ప్రతిబింబించేది కూడా. మొత్తంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఎన్నో ఆశలు.. ఎందరో ఎదురుచూపులు..
వచ్చే ఏడాదికి భారత జాతీయ స్థూల ఆదాయం వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతం వరకూ ఉంటుందని పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వే రిపోర్ట్ చెప్తోంది. అయితే.. సాధారణ, మధ్యతరగతి వర్గాల్లో కొనుగోలు శక్తి తగ్గుతున్న నేపథ్యంలో ఆర్ధికాభివృద్ధి ఏమేరకు పుంజుకోగలదనే ప్రశ్న ఉంది. మధ్యతరగతి వర్గాలకు వ్యక్తిగత ఆదాయ పన్నులో రాయితీలు, ప్రభుత్వాన్నే వెనక్కు తగ్గేలా చేసిన రైతులకు పంట గిట్టుబాబు ధరపై ప్రతిపాదనలు, జీవిత భీమా వంటి రాంగాల్లో ఆదాయపు పన్నులో రాయితీ, పట్టణ ఉపాధి పధకం అమలు.. ఇలా అనేక అంశాలపై బడ్జెట్ లో సమాధానం వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
ప్రజలకు భారం తగ్గుతుందా..
నరేంద్ర మోదీ ప్రధానిగా అధికారాలు చేపట్టిన తర్వాత కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారనే వాదనా ఉంది. అందుకు తగ్గట్టే 2019లో కార్పొరేట్ పన్నును 30 నుంచి 22 శాతానికి తగ్గించారు. దీనిని పరోక్షంగా పన్నుల రూపం సాధారణ, మధ్యతరగతి వర్గాలపై పడుతోంది. ప్రజలకు అందించే సౌకర్యాలు చౌకగా ఉంటే కొనుగోలు శక్తి పెరిగి పన్నులు వస్తాయి. ఉద్యోగాల కల్పన, కనీస వేతనాలు పెరగాల్సిన అవసరం ఉంది. సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలి, ధరలు తగ్గాలి, రాష్ట్రాలకు కేటాయించే వాటాలు పెరగాలి. ఇన్ని ఆశలు, కోరికల మధ్య ఆర్ధికమంత్రి ప్రవేశపెట్టబోయే దేశ బడ్జెట్ ఎందరి ఆశలు నెరవేరుస్తుందో చూడాలి..!