Bypoll Results: దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ఇవేళ వెలువడ్డాయి. అయితే ఓ నియోజకవర్గంలో అందరినీ ఆశ్చర్యాన్ని కల్గించే ఘటన వెలుగు చూసింది. అది ఏమిటంటే ఈ నియోజకవర్గంలో విజేత తర్వాత రెండవ స్థానంలో నోటా ఉండటం. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన ఓ రాజకీయ పార్టీ అభ్యర్ధికి ప్రధాన పార్టీల నుండి ప్రత్యర్ధులు ఎవరూ పోటీ లేకపోవడం వల్లనే నోటాను ఎక్కువ మంది ఎంచుకున్నారని భావిస్తున్నారు. వంద, వెయ్యి వరకూ నోటాకు ఓట్లు పడితే పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. గానీ ఇక్కడ ఏకంగా 12వేల మందికి పైగా ఓటర్లు నోటాను ఎంచుకోవడమే విశేషం. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది.
శివసేన పార్టీ రెండు గా చీలిపోయిన తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే వర్గంకు చెందిన అభ్యర్ధిని ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించింది. మెజార్టీ ఎమ్మెల్యేలతో శివసేన నుండి బయటకు వచ్చిన ఏక్ నాథ్ శిండే బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర రాజధాని ముంబై పరిధిలోని ఆంథేరీ ఈస్ట్ నియోజకవర్గ శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే ఈ ఏడాది మే నెలలో అకాల మరణం చెందడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో దివంగత ఎమ్మెల్యే రమేశ్ లాట్కే సతీమణి రుతుజా లాట్కే శివసేన ఉద్దవ్ వర్గం నుండి ఎన్నికల బరిలో దిగారు. బీఎంసీ లో క్లర్క్ గా పని చేస్తున్న ఆమె స్వచ్చంద పదవీ విరమణ చేశారు. లాట్కే రాజీనామా ఆమోదించిన తర్వాతే నామినేషన్ వేసేందుకు కోర్టు అంగీకరించింది.
రుతుజా లాట్కే బరిలో నిలిచిన తర్వాత కూడా బీజేపీ పోటీ చేయాలని భావించింది. అయితే ఎన్సీపీ సహా పలు పార్టీలు పోటీ నుండి తప్పుకోవాలని, రమేశ్ లాట్కే భార్యకు అవకాశం ఇవ్వాలని కోరాయి. దీంతో బీజేపీ పోటీ నుండి తప్పుకుంది. అయినా నలుగురు స్వతంత్ర అభ్యర్ధులు, రెండు చిన్న పార్టీల అభ్యర్ధులు మొత్తంగా రుతుజా లాట్కేతో కలిపి ఏడుగురు ఎన్నికల బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల నుండి అభ్యర్ధులు ఎవరూ లేకపోవడంతో రుతుజా విజయం లాంఛన ప్రాయంగానే మారింది. ఊహించినట్లుగానే ఆమెకు భారీ మెజార్టీని కట్టబెట్టారు ఓటర్లు. ఆమెకు 66530 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే స్వతంత్ర అభ్యర్ధులు అందరి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావడం. ఇక్కడ ఏకంగా 12806 మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. దీంతో ఇక్కడ నోటా సెకండ్ ప్లేస్ లో నిలిచింది.