Cable Bridge Collapse: గుజరాత్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోర్జీ పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిపోవడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడినట్లు సమాచారం అందుతోంది. ప్రమాద సమాచారం తెలియడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు, రెస్క్యూటీమ్ లు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్ లలో ఆసుపత్రులకు తరలించారు. వంతెన కూలిన సమయంలో దానిపై దాదాపు 500 మందికిపైగా సందర్శకులు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ కి మరమ్మత్తు పనులు పూర్తి చేసి ప్రారంభించిన అయిదు రోజుల క్రితమే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం. ఈ దుర్ఘటనలో ఎంత మంది గల్లంతు అయ్యారు. ఎంత మంది గాయపడ్డారు అనే పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాధమికంగా అందిన సమాచారం ప్రకారం ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి భుపేందర్ పటేల్ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం భూపేందర్ పటేల్ తో మాట్లాడినట్లు పీఎంఓ తెలిపింది. యుద్ద ప్రాతిపదికన రెస్క్యూ టీమ్ లను తరలించి సహాయక చర్యలు చేపట్టాలని సీఎంను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ.2లక్షలు,. క్షతగాత్రులకు రూ.50వేల వంతున పరిహారం ప్రకటించారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం.. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున పరిహారం ప్రకటించింది.