Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పై ఓటమి పాలైన సంగతి తెలిసిందే. నందిగ్రామ్ ఎన్నిక ఫలితం ప్రకటనలో పలు అక్రమాలు జరిగాయని మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి సువేందు ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ కౌశిక్ చందా నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అయితే బీజేపీ నేపథ్యం ఉన్న జస్టిస్ కౌశిక్ చందా పిటిషన్ విచారిస్తే తమకు న్యాయం జరగదని, కేసును మరో ధర్మాసనం ముందుకు మార్చవలసిందిగా మమత బెనర్జీ గత నెల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యదర్శికి లేఖ రాశారు.
మమత అభ్యర్థనపై స్పందించిన జస్టిస్ కౌశిక్ చందా నేడు విచారణ నుండి తప్పుకున్నారు. ఈ పిటిషన్ ను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్ కు పంపారు. అయితే ఈ సందర్భంగా సీఎం ఆరోపణలను న్యాయమూర్తి జస్టిస్ కౌశిక్ చందా తీవ్రంగా ఖండించారు. బీజేపీ లీగల్ సెల్ కు తాను ఎప్పుడూ కన్వీనర్ గా లేననీ, కోల్కతా హైకోర్టు కు రాకముందు ఆ పార్టీ తరపున కొన్ని కేసులు వాదించానన్నారు. పిటిషనర్ కేసులో విచారణ జరపాలని తనకు ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశం, ఆసక్తి లేదన్నారు. ప్రధాన న్యాయమూర్తి తనకు అసైన్ చేసిన పిటిషన్ లపై విచారణ జరపడం తన రాజ్యాంగ విధిగా పేర్కొన్నారు.
కానీ జూన్ 18న తాను ఈ పిటిషన్ విచారణ చేపట్టిన తరువాత టీఎంసీ నేతలు తన ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారనీ, ఇది పూర్తిగా న్యాయమూర్తిని అవమానించేందుకు చేసిన ముందస్తు ప్రణాళిక గా ఉందని జస్టిస్ కౌశిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థను కించపరిచినందుకు గానూ మమతా బెనర్జీకి రూ.5లక్షలు జరిమానా విదిస్తున్నట్లు చెప్పిన అనంతరం కేసు విచారణ నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. కాగా జస్టిస్ కౌశిక్ చందా కోల్ కతా హైకోర్టు బెంచ్ కు రాకముందు బీజేపి ప్రభుత్వానికి అదనపు సొలిసిటర్ జనరల్ గా పని చేశారు. ఆయనను హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమించడంపై మమతా బెనర్జీ గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?