రాజ్యాంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తొందని ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోడీకి లేఖ రాసిన మరుసటి రోజే బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకోవడం దేశ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సోమవారం రబ్రీ దేవి నివాసానికి చేరుకున్న సీబీఐ అదికారులు .. ఆమెను ఉద్యోగాల కుంభకోణం కేసులో ప్రశ్నించారు. అయితే తాము ఆమె నివాసంలో ఎలాంటి సోదాలు నిర్వహించలేదనీ, కేవలం రబ్రీదేవి వాంగ్మూలాన్ని నమోదు చేశామని తెలిపారు. రబ్రీ దేవి అపాయింట్ మెంట్ తీసుకున్న తర్వాతనే ఆమె ను ప్రశ్నించినట్లు సోమవారం వెల్లడించారు.

మాజీ సీఎం ఇంటికి సీబీఐ అధికారులు రావడంపై ఆర్జేడీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీకి రాసిన లేఖపై బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా సంతకం చేశారనీ, అందుకే కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. ఈ అంశంపై ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. రబ్రీ దేవి నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లడాన్ని ఆయన ఖండించారు. సీబీఐ అదికారుల చర్య ఆమెను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీ, గవర్నర్ లతో కేంద్రం ఇబ్బందులు పెడుతూ ప్రజా ప్రభుత్వాన్ని పని చేయనివ్వడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. అందరూ కలిసి పని చేస్తేనే ప్రజాస్వామ్యం ముందుకు సాగుతుందని అన్నాడు. తేజస్వి యాదవ్ పై ఒత్తిడి తీసుకురావడానికే కేంద్రం సీబీఐ దాడులు చేయిస్తొందని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆరోపించారు.
లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో గ్రూప్ – డీ ఉద్యోగాలు ఇప్పించి ఆ డబ్బుతో భూమిని కొనుగోలు చేశారని సీబీఐ అభియోగ పత్రం దాఖలు చేసింది. పట్నా జోన్ కు చెందిన కొందరికి ముంబయి, కోల్ కతా, జబల్ పుర్, జైపుర్ వంటి జోన్లలో ఉద్యోగాలు ఇప్పించారని, అందుకు బదులుగా ఆ అభ్యర్ధులు, వారి కుటుంబ సభ్యులు తమ భూములను లాలూ ప్రసాద్ కు, ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీకి బదిలీ చేశారనేది సీబీఐ అభియోగం. ఈ కేసులో సిబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూ ప్రసాద్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సమన్లు జారీ చేసింది, ఈ కేసుపైనే రబ్రీదేవిని సీబీఐ విచారిస్తొంది. దీనిపై అదనపు సమాచారం కోసం తాజాగా రబ్రీదేవి నివాసానికి వెళ్లినట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారాయింటూ ఆరోపిస్తూ ఆదివారం ప్రధాని మోడీకి ఎనిమిది విపక్ష పార్టీల నేతలు లేఖ రాసిన తరువాత ఈ పరిణామం జరగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
జీఐఎస్ సక్సెస్ తో వైసీపీ విజయోత్సవ సంబరాలకు ప్లాన్ .. ఎలా అంటే ..?