Covid Vaccination: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. టీకా వేయించు కోవడం కోసం ముందుగా ఎవరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. 18 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా దగ్గరలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి అప్పటికప్పుడు కోవిన్ యాప్ లో నమోదు చేసుకుని టీకా వేయించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందు వ్యాక్సినేషన్ కోసం ముందుగా ఆన్ లైన్ లో అపాయింట్ మెంట్ తీసుకోవడం వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని కేంద్రం దృష్టికి రావడంతో మేరకు నిర్ణయం తీసుకున్నది.
26 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి
దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి నిన్నటికి 151 రోజులు అయ్యింది. నిన్న సాయంత్రం వరకూ దేశంలో 25,90,44,072 మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. ఇందులో 21,01,66,746 మందికి మొదటి డోసు అందించగా, 4,88,77,326 మందికి రెండు డోసులు పూర్తి అయ్యాయి. మంగళవారం ఒక్క నాడే 39,27,154 మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో పక్క దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంకా వ్యాక్సిన్ పై అనుమానాలతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై శాస్త్రీయ విధానంతో ముందుకు వెళ్లాలని కేంద్రం అభిప్రాయపడుతోంది.
Read more: AP Governor Delhi Tour: ఏపి గవర్నర్ కు కేంద్రం నుండి కబురు..! ఎందుకంటే..?
Covid Vaccination: తగ్గుముఖం పడుతున్న కేసులు
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతూ వస్తున్నది. దీంతో కేసుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. 72 రోజుల తరువాత కనిష్ట స్థాయికి కేసుల నమోదు చేరాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 60,471 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 2,726 మంది కరోనా కారణంగా మరణించారు.