సాధారణంగా పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎన్నో వాణిజ్య ప్రకటనల ద్వారా అధికారులు తెలియజేస్తున్నప్పటికీ రోజురోజుకీ పొగతాగే వారి సంఖ్య పెరుగుతోంది. వయసు తారతమ్యం లేకుండా పొగాకు ఉత్పత్తులకు బానిసగా అయిపోయారు.ధూమపానానికి బానిస గా మారడం వల్ల ఎంతోమంది ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధ పడుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పొగాకు ఉత్పత్తులను వినియోగాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ వేదికగా ఓ కొత్త బిల్లును త్వరలోనే తీసుకురానుంది. దీనికోసం కేంద్రం ఇప్పటికే పలు అంశాలతో ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేసింది.
పొగాకు ఉత్పత్తులలో ఒకటైన సిగరెట్లను ఇప్పటివరకు విడివిడిగా అమ్మేవారు. ప్రస్తుతం విడిగా అమ్మే సిగరెట్ల విక్రయంపై నిషేధాన్ని విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం పొగ తాగడానికి ప్రస్తుతం ఉన్న కనీస వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 21 సంవత్సరాల లోపు ఉన్న వారు పొగాకు ఉత్పత్తులను విక్రయించి, నిబంధనలను ఉల్లంఘించినట్లు నిరూపితమైతే లక్ష రూపాయల జరిమానాతో పాటు, ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు.
ఇప్పటి వరకు రెస్టారెంట్లు, విమానాశ్రయాలలో పొగతాగడం కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి ఉన్న ప్రభుత్వాలు ప్రస్తుతం వాటిని కూడా మూసి వేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా విద్యాసంస్థల చుట్టు పరిసర ప్రాంతాలలో దాదాపు వంద మీటర్ల దూరం వరకు పొగాకు ఉత్పత్తులు అమ్మ కూడదనే అభిప్రాయాన్ని కూడా ఈ బిల్లులో పొందుపరిచినట్లు తెలియజేశారు. అయితే తొందరలోనే ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే నిబంధనలకు విరుద్ధంగా పొగతాగే వారిపై చర్యలు తప్పవని కేంద్రం తెలియజేసింది.