NV Ramana: దేశ అత్యున్నత న్యాయస్థాన అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగుతేజం జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (ఎన్వి రమణ) న్యాయవ్యవస్థలో తనదైన మార్కు చూపించబోతున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశంలో పలు జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటం, జైలులోని ఖైదీలు కరోనా బారిన పడుతున్న విషయంలో ఇటీవల జస్టిస్ ఎన్ వి రమణ కీలక సూచనలు చేశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులలో అవసరమతే తప్ప నిందితులను అరెస్టు చేసి కోర్టుకు, జైలుకు పంపవద్దని సూచించారు. అదే విధంగా పెరోల్ పై ఉన్న నిందితులకు మరి కొంత కాలం సెలవు పొడగించాలని తెలియజేశారు.
ఇప్పుడు తాజాగా మరో కీలక పరిణామానికి శ్రీకారం చుట్టారు. చాలా కాలం నుండి చర్చల్లో ఉన్న అంశంపై చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ దృష్టి సారించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జర్నిలిస్ట్ ల కోసం సుప్రీం కోర్టు ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ను చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ గురువారం ప్రారంభించారు. న్యాయస్థానాల్లో కార్యకలాపాలు, విచారణపై ప్రత్యక్ష ప్రసారం అంశంపై చాలా కాలం నుండి చర్చ జరుగుతూనే ఉంది. ప్రత్యక్ష ప్రసారం చేసే అంశం ఇప్పుడు సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది. కోర్టు వ్యవహారాల్లో దాపరికం లేకుండా ప్రత్యక్ష ప్రసారం విధానం అమలు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీం కోర్టు గతంలోనే స్పష్టం చేసింది. అయితే జస్టిస్ ఎన్వి రమణ సీజేఐగా బాధ్యతలు తీసుకున్న తరువాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దేశంలో పార్లమెంట్, రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వినియోగంలోకి తీసుకురానున్నట్లు సీజే జస్టిస్ ఎన్వి రమణ స్పష్టం చేశారు. వివాదాల సుడి దాటుకొని సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ వెంకట రమణ గతంలో అనేక కీలక అదేశాలు ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు సంబంధించి కేసులు సంవత్సరాలు తరబడి దేశ వ్యాప్తంగా అనేక కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆ కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.