ప్రతి పేదవాడికి న్యాయం అందించడమే న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం కావాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. సీజేఐగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా సుప్రీం కోర్టు బార్ రూమ్ లో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ గురజాడ పిలుపు అయిన సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడాలన్న సూక్తి న్యాయవ్యవస్థ స్పూర్తి మంత్రంగా భావించాలన్నారు. సత్యమేవ జయతే అనేది తాను నమ్మే సిద్దాంతమని అన్నారు. తనలో ఊపిరి ఉన్నంత వరకూ రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడతానన్నారు.
కనీస వసతులు లేని గ్రామం నుండి తన ప్రస్థానం ప్రారంభమైందనీ, ఓ సాధారణ కుటుంబం నుండి వచ్చాననీ పేర్కొన్న జస్టిస్ ఎన్వీ రమణ తన జీవితంలో ఎదురైన అనేక విషయాలను గుర్తు చేసుకున్నారు. 12 ఏళ్ల వయసులో తొలి సారి కరెంటు చూసినట్లు పేర్కొన్నారు. 17 ఏళ్లకు విద్యార్ధి సంఘానికి నేతృత్వం వహించానని చెప్పారు. ఈ వృత్తిలో అనేక ఒడిదొడుకులు వస్తాయని న్యాయవాదులు గ్రహించాలని సూచించారు. వృత్తిపరంగా జీవితంలో ఏన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు. తాను గొప్ప న్యాయమూర్తిని కాకపోవచ్చు కానీ సామాన్యుడికి న్యాయం అందించడానికి కృషి చేశానని పేర్కొన్నారు.
సీజేఐగా తన కర్తవ్య నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేసినట్లు జస్టిస్ వెంకట రమణ చెప్పారు. కేసుల పరిష్కారంలో కొత్త ఒరవడి తెచ్చామని, మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేసినట్లు వివరించారు. తాను సాధించిన ప్రతి గెలుపులోనూ సహచర న్యాయమూర్తుల భాగస్వామ్యం ఎనలేనిదని కొనియాడారు. పదవీ కాలంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సహకారం మర్చిపోలేనన్నారు. సుప్రీం కోర్టులో సహకారం అందించిన సెక్రటరీలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా సుప్రీం కోర్టు చరిత్రలో మొదటి సారిగా ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రత్యక్ష ప్రసారాల కోసం చాలా కాలం నుండి కృషి చేస్తున్నా జస్టిస్ వెంకట రమణ పదవీ విరమణ చేస్తున్న రోజు ఈ ప్రక్రియకు కార్యరూపం ఇచ్చారు. అన్ని కోర్టుల నుండి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఆయన ఆకాంక్షించారు.
జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయవాదులు భావోద్వేగానికి లోనైయ్యారు. జస్టిస్ రమణ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, కపిల్ సిబల్, వికాస్ సింగ్ తదితరులు జస్టిస్ రమణ సేవలను కొనియాడారు. కాగా రేపు 49వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జస్టిస్ యూయూ లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక యూయూ లలిత్ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవీ లో కొనసాగనున్నారు. నవంబర్ 8న ఆయన పదవీ కాలం ముగుస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?