భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ఎన్ వీ రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి సీజే ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయ్యింది. సుప్రీం కోర్టులో తన తరువాత సీనియర్ గా ఉన్న న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ పేరును 49వ సీజేఐగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు సీజే జస్టిస్ ఎన్ వీ రమణ లేఖ రాశారు. న్యాయశాఖ ఆ ప్రతిపాదనను ప్రధాన మంత్రి పరిశీలనకు పంపనుంది. పీఎం మోడీ పరిశీలన అనంతరం ఆ ప్రతిపాదన రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపడతారు.
ప్రస్తుత సీజే జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 26వ తేదీ పదవీ విరమణ చేయనుండగా, ఆ మరుసటి రోజు (ఆగస్టు 27న) సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే ఆయన పదవీ కాలం మూడు నెలల్లోపే (74 రోజులు) ముగుస్తుంది. నవంబర్ 8న ఆయన పదవీ విరమణ అవుతారు. దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెల్లడించిన ధర్మాసనాల్లో జస్టిస్ యూయూ లలిత్ భాగస్వామిగా ఉన్నారు. బార్ నుండి నేరుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులై అనంతరం సీజేఐ అయిన రెండో వ్యక్తిగా నిలుస్తారు జస్టిస్ యూయూ లలిత్. 1971 జనవరిలో 13వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎస్ఎం సిక్రీ నేరుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయిన మొదటి న్యాయవాది. 1964లో ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైయ్యారు.
1975 నవంబర్ 9వ తేదీన జన్మించిన ఆయన 1983 జూన్ లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1985 వరకూ బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. 1986 జనవరి నుండి సుప్రీం కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 2004లో సీనియర్ న్యాయవాది హోదా సాధించారు. అనేక కేసుల్లో అమికస్ క్యూరీగా వ్యవహరించారు. క్రిమినల్ కేసులు వాదించడంలో దిట్టగా పేరు గాంచారు. 2014 ఆగస్టు 13న సుప్రీం న్యాయమూర్తిగా నియమితులైయ్యారు జస్టిస్ యూయూ లలిత్.