CJI Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సర్వోన్నత న్యాయస్థానంలో కొత్త జడ్జీల నియామకంపై మీడియాలో వచ్చిన వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త జడ్జీల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు ఇవీ అంటూ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సుల ప్రకారం 2027లో దేశానికి తొలి మహిళా సీజేఐ రాబోతున్నారని, ఆమె కర్ణాటక జడ్జిగా ఉన్న నాగరత్నే కావచ్చని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read More: Justice NV Ramana: పార్లమెంట్పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
సీజేఐ రమణ ఏమంటున్నారంటే..
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంపై అధికారిక ప్రకటన కంటే ముందే వార్తలు రావడం ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎన్వీ రమణ అన్నారు. అలాంటి నియామకాలపై రిపోర్ట్ చేసేటప్పుడు మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. జడ్జీల నియామక ప్రక్రియకు ఓ పవిత్రత, హుందాతనం ఉంటాయి. మీడియా స్నేహితులు ఈ ప్రక్రియ పవిత్రతను అర్థం చేసుకోవాలి, గుర్తించాలి అని రమణ అన్నారు. ఇలాంటి బాధ్యతా రహిత రిపోర్ట్ల కారణంగా అర్హులైన అభ్యర్థులకు పదవులు దక్కని ఘటనలు ఎన్నో ఉన్నాయి. వీటిపై నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను. ఇలాంటి తీవ్రమైన అంశంపై సీనియర్ జర్నలిస్టులు, మీడియా సంస్థలు కాస్త పరిణతితో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని సీజేఐ సూచించారు.
Read More: NV Ramana: జస్టిస్ ఎన్వీ రమణ సంచలన నిర్ణయం..! ఇక కోర్టులు ప్రత్యక్ష ప్రసారాలు..!?
ఇటీవల పార్లమెంటు తీరుపైనా….
పార్లమెంట్ పనితీరుపైనా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాలను రూపొందించే సమయంలో చర్చలపై కాకుండా ఆటంకాలు సృష్టించడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ పనితీరు తీవ్ర నిరాశజనకంగా ఉన్నదని, అసలు సరైన చర్చే జరగడం లేదని విమర్శించారు. చట్టాలపై స్పష్టత లేదు. అసలు చట్టం ప్రయోజనం ఏంటో తెలియదు. ఇది ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతోంది అని పేర్కొన్నారు. లాయర్లు, మేధావులు సభలో లేనప్పుడు ఇలాగే జరుగుతుంది అని రమణ అనడం గమనార్హం. ఒకప్పుడు సభలో మొత్తం లాయర్లే ఉన్న సమయంలో పార్లమెంట్ ఎంతో హుందాగా నడిచేదని సీజేఐ అనడం గమనార్హం. అందుకే న్యాయ వ్యవస్థలోని వాళ్లు ప్రజాసేవపైనా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.