CM : రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. అయితే, ఎన్నికల సమయంలో ఇవి మరింత ముదురుతుంటాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ రాష్ట్రంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను టార్గెట్ చేసి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను గోల్ కీపర్ను
హుగ్లీలోని షాన్గంజ్లో జరిసన సభలో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో నేను గోల్ కీపర్గా ఉంటాను.. బీజేపీ ఒక్క గోల్ కూడా చేయలేదన్నారు. మోడీ, అమిత్షా ద్వయం విపరీతమైన అబద్ధాలను ప్రచారం చేస్తూ, దేశ వ్యాప్తంగా విద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. మోడీ అల్లర్లు సృష్టించే వ్యక్తి.. అల్లర్ల ద్వారా ట్రంప్ సాధించిందేమి? అంతకంటే ఘోరమైన ఇబ్బందులను మోడీ ఎదుర్కొంటారు అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.. బీజేపీని ఒక్కడ ఓడగొడితే.. దేశవ్యాప్తంగా ఆ పార్టీని ఓడించడం అసాధ్యమేమీ కాదని మమతాబెనర్జీ తెలిపారు.
నన్ను పాతి పెట్టినా…. మేనల్లుడు , కోడలిని…
మమత మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువునష్టం కేసులో.. కేంద్ర హోంమంత్రి అమిత్షాకు నోటీసులు వెళ్లిన విషయం తెలిసిందే. మరోవైపు.. అభిషేక్ బెనర్జీ భార్యకు బొగ్గు కుంభకోణం కేసులు నోటీసులు ఇచ్చారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్యపై సీబీఐ దర్యాప్తు విషయంలో బీజేపీపై మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. నన్ను చంపండి.. కొట్టండి.. అంతేగానీ, మా కోడలిని అవమానపరుస్తారా? బొగ్గు దొంగ అని విమర్శిస్తారా? మీరేమైనా మచ్చలేని వారా? మీ గురించి మాకన్నీ తెలుసు. అంటూ విరుచుకుపడ్డారు.. ఇక, గుజరాతీలు బెంగాల్ను ఎన్నడూ పరిపాలించలేరని పరోక్షంగా మోడీ, షా ద్వయంపై విమర్శలు గుప్పించారు. నన్ను పాతిపెట్టినా చెట్టులా విస్తరిస్తూనే ఉంటానని వ్యాఖ్యానించిన మమతా.. ఆట మొదలైందన్నారు.