చత్తీస్గఢ్ లోని రాయ్పూర్ లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కీలక ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్ ముగిసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మూడు రోజుల పార్టీ ప్లీనరీ లో 1500 మంది ప్రతినిధులు పాల్గొనగా, ప్రతినిధులను ఉద్దేశించి సోనియా మాట్లాడుతూ దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నారని భారత్ జోడో యాత్ర సందర్భంగా రుజువైనట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో వచ్చే ఎన్నికలకు సిద్దం కావాలని పార్టీ శ్రేణులకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు.
ప్లీనరీలో బీజేపీ పాలన తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సోనియా గాంధీ. మైనార్టీలు, దళితులు, గిరిజనులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొడుతుందని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మోడీ సర్కార్ అన్ని సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపించారు. ఆదానీ వంటి సంస్థలను పెంచి పోషిస్తొందని సోనియా అన్నారు. రాజ్యాంగ విలువలను బీజేపీ ఎప్పుడో మర్చిపోయిందని విమర్శించారు. తాను తొలి సారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టిన నాటి పరిస్థితలను ప్రస్తుత పరిణామాలు గుర్తు చేస్తున్నాయన్నారు. ప్రస్తుత పాలనను పటిష్టంగా ఎదుర్కొవాలని, పార్టీ సందేశాన్ని ప్రజలకు చేరవేయాలని ఆమె కోరారు.
2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొవడానికి భావసారూప్యత గల సెక్యులర్ పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లాలని పార్టీ అభిప్రాయపడింది. ఎన్నికల కార్యాచరణపై తీర్మానం చేసింది. గుర్తించడం, సమీకరించడం, కలిసి పని చేయడం అనే ఫార్ములా ప్రకారం ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగాలని పార్టీ నిర్ణయించింది. సెక్యులర్, సోషలిస్ట్ పార్టీలను ఏకం చేయడమే కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళిక అని తెలిపింది. కాంగ్రెస్ సిద్ధాంతాలతో ఏకీభవించే పార్టీలను గుర్తించాలని, సారూప్య సిద్దాంతాల అధారంగా విపక్ష పార్టీలను తక్షణమే ఏకం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. థర్డ్ ఫ్రంట్ తో బీజేపీకే లబ్దిచేకూరుతుందని అభిప్రాయపడింది.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే సరైన నాయకత్వం అందించగలదని చెప్పింది. ఈ ప్లీనరీలో పార్టీ రాజ్యాంగాన్ని సవరించింది. రిజర్వుడ్, అన్ రిజర్వుడ్ కేటగిరిల్లో అన్ని స్థాయిలో యువత, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని సవరించింది. కాంగ్రెస్ తన వర్కింగ్ కమిటీ లో సభ్యుల సంఖ్యను 25 నుండి 35 కు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పార్టీ మాజీ ప్రధానులు, ఏఐసీసీ మాజీ చీఫ్ లను చేర్చడానికి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని సవరించారు.