కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్తో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ ఎంపిలు విజయ చౌక్ నుండి రాష్ట్రపతి భవన్ వరకూ చేపట్టనున్న నిరసన ప్రదర్శన నిర్వహించాలని భావించారు. అనంతరం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిసి దేశంలోని రెండు కోట్ల మంది రైతుల నుండి సేకరించిన సంతకాలను, వినతి పత్రాన్ని అందజేయాలని నిర్ణయించుకున్నారు. అయితే రాహుల్ ప్రదర్శనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రపతిని కలిసేందుకు రాహుల్ తో పాటు మరో ముగ్గురు ఎంపిలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఢిల్లీ అడిషనల్ డీసీపీ దీపక్ యాదవ్ పేర్కొన్నారు. నిరసన ప్రదర్శన నిర్వహించే ప్రాంతంలో 144 సెక్షన్ ను విధించారు. రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
ఇదిలా ఉండగా ఏఐసీసీ కార్యాలయం నుండి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు రాష్ట్రపతి భవన్కు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. కేవలం అనుమతి ఉన్నవారిని మాత్రమే వెళ్లనిస్తామని పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. నిరసన ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రియాంక గాంధీతో సహా పలువురు నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఎదుట భైటాయించి ధర్నా చేశారు. దీంతో ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంలో ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
దేశంలో ప్రజాస్వామ్యమే లేదు
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన రాష్ట్రపతి భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యమే లేదని విమర్శించారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని తీవ్ర వాదులుగా ముద్రలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లడినా అదే ముద్ర వేస్తుందని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందని అనుకుంటే అది వారి భ్రమేనని రాహుల్ అన్నారు. రైతుల డిమాండ్ లు నెరవేరితేనే ఆందోళన విరమిస్తారని చెప్పారు. లేకుంటే ఆ ఆందోళనను కొనసాగిస్తామని పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తేనే రైతులు తమ తమ ఇళ్లకు వెళ్లిపోతారని అన్నారు. ఈ చట్టాలపై ప్రభుత్వం వెంటనే ఉభయ సభలను సమావేశపర్చి చట్టాలను రద్దు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.
తొలుత రాహుల్ గాంధీ రాష్ట్రపతి భవన్ కు ర్యాలీ నిర్వహించారు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సేకరించిన రెండు కోట్ల సంతకాలతో వినతి పత్రాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు రాహుల్ బృంద్ అందజేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?