గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్ లో వరుసగా ఏడవ సారి బీజేపీ అధికారం రావడం ఖాయమైపోయింది. మునుపెన్నడూ లేని విధంగా బీజేపీ గుజరాత్ 140కిపైగా సీట్లు కైవశం చేసుకునే పరిస్థితి కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయే పరిస్థితులు వచ్చాయి.ఇక హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే గత సంప్రదాయనికి భిన్నంగా కాంగ్రెస్, బీజేపీ మద్య హోరా నడుస్తొంది. ప్రతి సారి ప్రతిపక్ష పార్టీకి అధికారాన్ని కట్టబెడుతూ మార్పును కొరుకునే హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఈ సారి ఎలాంటి తీర్పు ఇస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది.
హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 స్థానాలు ఉండగా, అధికారం చేపట్టడానికి కనీసం 35 నియోజకవర్గాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం బీజేపీ 30, కాంగ్రెస్ 34, ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ ఉండటంతో అధికార బీజేపీ ప్లాన్ బీకి సిద్దమైంది. పలు రాష్ట్రాల్లో గతంలో బీజేపీ అమలు చేసిన విధానాన్నే ఇక్కడ అమలు చేసే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ లొంగదీసుకోకుండా కాపాడుకునేందుకు వారిని రాజస్థాన్ (రిస్టార్ రాజకీయం)కు తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తొంది.
చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాలు ఆ బాధ్యలను చేపట్టినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్ నుండి బస్సులో రాజస్థాన్ తరలించనున్నట్లు తెలుస్తొంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వ్యక్తిగతంగా ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని అంటున్నారు. ప్రియాంక ఈ రోజు సిమ్లాకు చేరుకుంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.