Congress Presidential Elections: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. అధ్యక్ష పదవికి సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిధరూర్ పోటీ పడుతున్నారు. 24 ఏళ్లు సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర నేత కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో అధ్యక్ష పదవికి పోటీ జరగడం ఇది ఆరో సారి. 22 సంవత్సరాల క్రితం అధ్యక్ష పదవికి సోనియా గాంధీ, జితేంద్ర ప్రసాద్ లు పోటీ పడగా సోనియా గాంధీ ఎన్నికైయ్యారు. 1998 నుండి 2017 వరకూ, 2019 నుండి ఇప్పటి వరకూ సుమారు 20 ఏళ్లకు పైగా అధ్యక్షురాలుగా కొనిసాగిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుంది. 2017 లో రాహుల్ గాంధీ అధ్యక్షుడుగా ఎన్నికైయ్యారు.
కాగా నేడు దేశంలోని అన్ని రాష్ట్రాల పిసిసి కార్యాలయాల్ల, ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో పోలింగ్ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 65 పోలింగ్ బూత్ లలో నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో భారత్ జోడో యాత్రకు ఈ రోజు విరామం ప్రకటించారు. రాహుల్ గాంధీ సహా భారత్ జోడో యాత్రలో పాల్గొన్న దాదాపు 40 మంది ప్రతినిదులు బళ్లారి వద్ద జోడో యాత్ర క్యాంప్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తదితర ప్రతినిధులు ఏఐసీసీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న శశిధరూర్ .. తిరువనంతపురంలోని కాంగ్రెస్ ప్రదాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మల్లికార్జున ఖర్గే .. బెంగళూరులోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రోజు పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను ఢిల్లీకి తరలిస్తారు. ఈ నెల 19 (ఎల్లుండి) ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాన్ని వెల్లడించనున్నారు.