కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సీనియర్ నేత గులాం నబీ అజాద్ షాకిచ్చారు. పార్టీ అధిష్టానం తీరుపై చాలా కాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన ఆజాద్ .. పార్టీలో మార్పుల కోసం పట్టుబడుతున్నారు. పార్టీలో సంస్కరణలు తేవాలంటూ గళమెత్తిన జీ 23 నేతల్లో .. ఆజాద్ ఒకరు. ఆజాద్ రాజ్యసభ పదవీ కాలం గత ఏడాది ముగియగా, ఆ తర్వాత పార్టీ అధిష్టానం ఆయనను మరో సారి అవకాశం ఇవ్వలేదు. ఈ తరుణంలో జమ్ము కశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా అజాద్ ను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నియమించగా, ఆయన ఆ బాధ్యతలను తిరస్కరించారు.
అజాద్ సన్నిహితుడైన వికార్ రసూల్ వానీని జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడుగా నియమించిన పార్టీ అధిష్టానం..ప్రచార కమిటీ చైర్మన్ అజాద్ ను నియమించగా, కొద్ది సేపటికే ఆ ఆఫర్ ను అజాద్ తిరస్కరించారు. అయితే జమ్ము కశ్మీర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆలిండియా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడినైన తనను జమ్ముకశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల ఆయన అసంతృప్తికి గురైనట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ నియామకాన్ని ఆయన డిమోషన్ గా భావిస్తున్నారని చెబుతున్నారు.
మరో సారి రాజ్యసభకు అవకాశం కల్పించకపోవడంతో పాటు పార్టీలో తన హోదాను తగ్గించారని ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అరోగ్య కారణాలతో అజాద్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉండటానికి నిరాకరించారని ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియజేశారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వచ్చే ఏడాది జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ .. రాష్ట్రంలో సంస్థాగత మార్పులు చేపట్టింది. ప్రచార కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ.. తదితర కమిటీలను ఏర్పాటు చేసింది.