Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వంద మందికిపైగా మృతి చెందారని భావిస్తన్నారు. ఈ ఘటన బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ఘటనతో 12 బోగీలు బోల్తా పడ్డాయి. దాదాపు 350 మంది కిపైగా ప్రయాణీకులకు గాయాలు అయినట్లు తెలుస్తొంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయక సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బోగీలో చిక్కుకున్న ప్రయాణీకులను బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి సమయం కావడంతో సహాయ చర్యలకు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. రాత్రి 7.17 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మరో ట్రాక్ పై పడిన బోగీలను అటువైపుగా వస్తున్న యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. దీంతో యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారు అన్నది ఇంకా లెక్కించలేదని ఒడిశా సీఎస్ తెలిపారు. సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నాలుగు రాష్ట్ర సహాయక బృందాలు రంగంలోకి దించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు దాదాపు 60 అంబులెన్స్ లను ఘటనా స్థలానికి తరలించినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా బాలేశ్వర్ లోని వైద్య కళాశాలలు, ఆసుపత్రులను అధికారులు అప్రమత్తం చేశారు. బాలేశ్వర్ లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. బాధితుల సమచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నెంబర్ 06782262286 కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పశ్చిమ బెంగాల్ లోని షాలిమార్ నుండి చెన్నై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భాంతి వ్యక్తం చేశారు. తమ రాష్ట్రం నుండి ప్రయాణీకులతో వెళుతున్న రైలు బాలేశ్వర్ వద్ద గూడ్స్ రైలును ఢీకొట్టిందని, తమ రాష్ట్రానికి చెందిన వారి క్షేమం కోసం ఒడిశా ప్రభుత్వం, సౌత్ ఈస్ట్రన్ రైల్వేతో సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని పేర్కొంటూ 033 – 22143526, 22535185 నంబర్ లను ఆమె షేర్ చేశారు. ఘటనా స్థలానికి 5- 6 సభ్యుల బృందంతో పాటు రైల్వే అధికారులను పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులతో కలిసి తాను వ్యక్తిగతంగా అక్కడి పరిస్థితి పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు మమతా బెనర్జీ ఓ ప్రకటనలో తెలిపారు.
కాగా రైలు ప్రమాదంలో మృతులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం నవీన్ పట్నాయక్, ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైలు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తూ బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పై మాజీ మంత్రి పేర్ని సెటైర్లు