Corona cricis: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా కట్టడికి వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలు అమలు చేస్తున్నాయి. దీంతో చిరువ్యాపారులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తోపుడు బండ్ల వ్యాపారులు, టీ స్టాల్స్, దిన సరి కూలీలు, హోటల్స్ లో పని చేసే కార్మికులు ఇలా అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్గాల కోసం ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం చేయడం లేదు. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం కేవలం బియ్యం, గోధుమలు మాత్రమే మనిషికి 5కేజీల చొప్పున ఉచితంగా అందజేస్తుంది. ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు కేవలం రేషన్ బియ్యం లేదా గోధుమలు మాత్రమే ఉచితంగా ఇస్తే కుటుంబ జీవనం సాగుతుందా. ఈ వర్గాలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత వరకూ ఎటువంటి ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించలేదు. దీంతో మహారాష్ట్రలోని బారామతికి చెందిన ఈ టీ స్టాల్ నడుపుకునే వ్యక్తి అనిల్ మోరే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వినూత్న రీతిలో నిరసన తెలియజేయాలని భావించాడు.
కరోనా ప్రారంభం నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గడ్డం, మీసం కటింగ్ చేయించుకోకుండా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని గడ్డం గీసుకోవాలని సూచిస్తూ ప్రధాని మోడీకి రూ.100లు పంపించాడు అనిల్ మోరే. ఆ వంద రూపాయలతో పాటు ఓ లేఖను జత చేశాడు.
Read More: Costly Mango: ఒక్కో మామిడి పండు రూ. 1000.. దీని వెరైటీ తెలుసా..!?
పీఎం నరేంద్ర మోడి గడ్డం పెంచుతున్నారు. ఆయన ఇకపై ఏదైనా పెంచాలనుకుంటే అది ఈ దేశ ప్రజల ఉపాధి అవకాశాలు కల్పించేదిగా అయి ఉండాలి. దేశ జనాభాకు వీలైనంత త్వరగా వాక్సిన్ వేయించడానికి, వైద్య సదుపాయాలను పెంచడానికి ఆయన ప్రయత్నాలు చేయాలి. చివరి రెండు లాక్ డౌన్ ల వల్ల కలిగిన కష్టాల నుండి ప్రజలను బయటపడేయడంపైనే ప్రధాన మంత్రి దృష్టి సారించాలి అని అనిల్ మోరే లేఖలో పేర్కొన్నాడు.
ఈ దేశ అత్యున్నత నాయకుడైన ప్రధాన మంత్రి మోడీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందనీ, దాచుకున్న డబ్బుల నుండి మోడీ గడ్డం గీయించుకునేందుకు రూ.100లు పంపుతున్నాననీ, ఆయనను అవమానించడం, బాధపెట్టడం తన ఉద్దేశం కాదని పేర్కొంటూ మహమ్మారి కారణంగా రోజురోజుకుకు ఈ దేశ పేదలు పడుతున్న ఇబ్బందులను ఆయనకు తెలియజేయాలనీ, ఆయన దృష్టిని ఆకర్షించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు అనిల్ మోరే వివరించారు. వినూత్న రీతిలో ఓ చాయ్ వాలా లేఖ పీఎంకు లేఖ రాసిన అంశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై ప్రధాని మోడీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.