Corona Effect: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. గత నాలుగు రోజులుగా రోజుకు 25వేల వరకూ కేసులు నమోదు అవుతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్ లు, ఆక్సిజన్, మందుల కొరత ఏర్పడింది. దీంతో లాక్ డౌన్ ను ఈ రోజు రాత్రి 10 గంటల నుండి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకూ అమలు చేయాలని నిర్ణయించారు. లాక్ డౌన్ నిర్ణయం ప్రకటనకు ముందు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తో సీఎం కేజ్రీవాల్ భేటీ అయి చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాలుగు రోజులుగా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయనీ, దీంతో ఆసుపత్రుల్లో బెడ్లు, మందులు, ఆక్సిజన్ కొరత ఏర్పడిందన్నారు. ఈ లాక్ డౌన్ కాలంలో ఆసుపత్రుల్లో బెడ్ లు, అక్సిజన్, మందులు సమకూర్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలియజేశారు. లాక్ డౌన్ సమయంలో అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందన్నారు. నిత్యావసరాలు, ఆహార సంబంధిత, వైద్యం, సహా ఇతర అత్యవసర సేవలు కొనసాగుతాయని తెలిపారు. ప్రైవేటు కార్యాలయాలు అన్నీ వర్క్ ఫ్రం హోం ద్వారా జరుపుకోవాలని సూచించారు. వలస కూలీలు మాత్రం వెళ్లాల్సిన అవసరం లేదనీ, లాక్ డౌన్ ఆరు రోజులు మాత్రమే ఉంటుందని, ఆ తరువాత కొనసాగించాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నానన్నారు. ఇప్పటికే ఢిల్లీలో వారాంతపు లాక్ డౌన్ కొనసాగుతుండగా నేటి రాత్రి నుండి పూర్తి స్థాయి లాక్ డౌన్ కు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.
ఢిల్లీలో ఆదివారం 25,462 పాజిటివ్ కేసులు నమోదు కాగా 161 మంది కరోనా కారణంగా మరణించారు. పాజిటివిటీ రేటు 30శాతంగా ఉన్నదని ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.