Corona Effect: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న వేళ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంలో ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల ర్యాలీ, ప్రచారాలను కట్టడి చేయడంలో ఎన్నికల సంఘం విఫలం అవ్వడంతో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. దీనిపై హైకోర్టు ఈసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల అధికారులపై హత్యాభియోగం ఎందుకు మోపకూడదంటూ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నొచ్చుకోవడమే కాక హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు నుండి అక్షింతలు పడిన నేపథ్యంలో ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాలలో నిర్వహించాల్సిన ఉప ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ కరోనా ఉధృతి వేగంగా పెరుగుతున్న కారణంగా పలు కారణాలతో ఖాళీ అయిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేసినట్లు ఈసీ ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
దేశంలో కరోనా పరిస్థితులపై సమీక్షించిన ఈసీ..పరిస్థితులు మెరుగపడే వరకూ ఉప ఎన్నికలు నిర్వహించరాదని నిర్ణయించినట్లు పేర్కొంది. మధ్యప్రదేశ్ లోని దాద్రా నాగర్ హవేలీ, ఖండ్వా, హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానాలతో పాటు పలు రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఈసీ ఇప్పటికే నోటిఫై చేసింది. ఏపిలోని బద్వేలు నియోజకవర్గంతో పాటు హరియాణలోని కల్కా, ఎలియాబాద్, రాజస్థాన్ లోని వల్లభ్ నగర్, కర్నాటక లోని సిండ్గి, మేఖాలయలోని రాజబల్ల, మారైంగ్ కేంగ్, హిమాచల్ ప్రదేశ్ లోని ఫతేపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ఈ రాష్ట్రాల నుండి సమాచారం తీసుకుని పరిస్థితులను సమీక్షించి తగిన సమయంలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకోనున్నట్లు ఈసిీ తెలిపింది.
ఏపిలోని కడప జిల్లా బద్వేలులో వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మార్చి నెలాఖరున అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది.