corona effect: భారత్ లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న నేపథ్యంలో ఇతర దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. రోజు వారి కేసుల నమోదు మూడున్నర లక్షలు దాటాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో భారత్ నుండి వచ్చే ప్రయాణీకులపై నిషేదం విధిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే సింగపూర్, న్యూజిల్యాండ్, కెనాడా దేశాలు రెండు రోజుల క్రితమే భారత్ నుండి విమానాలపై ఆంక్షలు విధించాయి.
ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి ఇటలీ, నెదర్లాండ్ దేశాలు చేరాయి. గత 14 రోజులుగా భారత్ లో ఉన్న విదేశీయులు ఇటలీకి రాకుండా నిషేదం విధిస్తున్నట్లు ఆ దేశం తెలిపింది. ఈ మేరకు ఫైల్ పై సంతకం చేసినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి రొబెర్టో స్పెరాన్జా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే తమ దేశానికి చెందిన భారత్ నుండి స్వదేశానికి రావచ్చనీ, అలాంటి వారు కరోనా నెగిటివ్ రిపోర్టు చూపడం తప్పనిసరి అని పేర్కొన్నారు. అదే విధంగా వారు స్వదేశానికి వచ్చిన తరువాత 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందేనని తెలిపారు. అదే విధంగా భారత్ నుండి అన్ని ప్యాసింజర్ విమానాలను రద్దు చేస్తున్నట్లు మరో వైపు నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉత్తర్వులు సోమవారం సాయంత్రం 6గంటల నుండి మే 1వ తేదీ వరకూ అమల్లో ఉంటాయని ఆ దేశ విమానయాన శాఖ తెలియజేసింది.