Corona Triple Mutation: దేశంలో కరోనా రెండవ దశ వేగంగా విస్తరిస్తోంది. కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొత్త కేసులు ఊహకందని రీతిలో పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా మూడున్నర లక్షలకుపైగా నిత్యం కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మొదటి దశలో వచ్చిన కరోనా కంటే ఈ సారి రెండవ దశలో వస్తున్న కరోనా ప్రమాదకరమని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకూ సెకండ్ మ్యుటేషన్ చూడగా, థర్డ్ (ట్రిపుల్) మ్యుటేషన్ (రెండు స్ట్రెయిన్లు కలిసిన కొత్త వైరస్) మరింత ప్రమాదకరంగా మారుతుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరి కొందరు థర్డ్ వేవ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ మ్యుటేషన్ స్ట్రెయిన్ల ద్వారా వైరస్ మరింత వేగంగైా వ్యాపిస్తుందనీ, ఇది మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చమ బెంగాల్ రాష్ట్రాల్లో కనిపించిందని మెక్ గిల్ యూనివర్శిటీ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మధుకర్ తెలిపారు. ఇలాంటి మ్యుటేషన్ పైన, జెనోమ్ సీక్వెన్సింగ్ కారణాలపై అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. పలు మెడికల్ జర్నల్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
Corona Triple Mutation: అసలు ట్రిపుల్ మ్యుటేషన్ అంటే ఏమిటంటే..
రెండు కరోనా స్ట్రెయిన్స్ కలిపితే డబుల్ మ్యుటేషన్ కాగా ఆ డబుల్ మ్యుటేషన్ తన జన్యుపరమైన మార్పులతో ఆవిర్భవించిన కొత్త స్ట్రెయిన్ నే (మూడు రకాల కోవిడ్ వేరియంట్స్) ట్రిపుల్ మ్యుటేషన్ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం డబుల్ మ్యుటేషన్ కారణంగానే చిన్నపిల్లలకూ ఈ వైరస్ ప్రమాదకరంగా మారింది. వేగంగా విస్తరిస్తోంది. గతంలో కరోనా సోకిన వ్యక్తి నుండి ఒకరిద్దరికి మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి చెందగా డబుల్ మ్యుటేషన్ లో ఏడు ఎనిమిది మందికి వ్యాప్తి చెందడం వల్ల కేసులు పెరుగుతున్నాయని పలువురు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
18 రాష్ట్రాల్లో ఇటీవల సేకరించిన కోవిడ్ నమూనాల్లో ఒక కొత్త మ్యుటేషన్ వేరియంట్ కనిపించినట్లు పూనే లోని ఎన్ ఐ వీ తెలిపింది. జనవరి నుండి మార్చి మధ్య కాలంలో సెకరించిన 361 శ్యాంపిల్స్ లో 61 శాతం డబుల్ మ్యుటేషన్ వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అంటే ఇ 4840, ఎల్ 452 ఆర్ రెండు స్ట్రెయిన్ లు కలిపి వైరస్ ని బి 1 -617 గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీలో ఈ రకమైన కేసులు గుర్తించగా తాజాగా పశ్చమ బెంగాల్ లోనూ ట్రిపుల్ మ్యుటేషన్ కేసు బయటపడినట్లు పలు మెడికల్ జర్నల్స్ పేర్కొన్నాయి. ట్రిపుల్ మ్యుటేషన్ కేసులు బెంగాల్ లో బయటపడినట్లు తమకు సమాచారం అందిందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో వారు అధ్యయనం చేస్తున్నారన్నారు.
జీనోమ్ సీక్వెన్స్ పై అధ్యయనం చేయడానికి దేశంలో పలు ల్యాబ్ లు సిద్ధంగా ఉన్నా మొత్తం పది ల్యాబ్ లకే ఆ సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు యూనివర్శిటీలు దీనిపై పరిశోధనలు చేస్తున్నాయి. ఆగస్టు నాటికి దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావచ్చనే అభిప్రాయాన్ని శాస్తవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.
శుభ వార్త చెప్పిన భారత్ బయోటెక్
డబుల్ మ్యుటేషన్, త్రిపుల్ మ్యుటేషన్ లపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ కోవ్యాగ్జిన్ కరోనా టీకా ఉత్పత్తి చేసిన భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. కొత్తరకం వైరస్ పైనా కోవ్యాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తుందని ఐసీఎంఆర్ ప్రకటించింది.