Corona: దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతోంది. భారత్లో కరోనా కేసులు రోజు రోజుకు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారి కేసుల సంఖ్య ఇప్పటికే మూడు లక్షలు క్రాస్ చేయగా.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సమయంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇప్పుడు ఏకైక మార్గం వ్యాక్సిన్ ఇవ్వడమే. దీంతో భారత్ వీలైనంత వేగంగా వ్యాక్సిన్ అందజేయడం టార్గెట్గా పెట్టుకుంది.
ఇదో గుడ్ న్యూస్…
వ్యాక్సినేషన్లో భారత్ మరో రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలో ఏ దేశంలోనే జరగనంత స్పీడ్గా భారత్లో వ్యాక్సినేషన్ జరగుతోంది.దీని ఫలితంగా అత్యంత వేగంగా వ్యాక్సిన్లు వేసిన దేశంగా భారత్ రికార్డులకెక్కింది. కేవలం 99 రోజుల్లోనే 14 కోట్లకు పైగా వ్యాక్సిన్లు వేసింది. ఈ సంఖ్యను చేరుకోవడానికి అమెరికాకు 104 రోజుల సమయం పట్టగా డ్రాగన్ కంట్రీ చైనాకు 112 రోజులు పట్టింది. వచ్చే మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి అందరికీ వ్యాక్సినేషన్ జరగనుండంతో.. ఈ కార్యక్రమం మరింత స్పీడ్గా సాగనుంది. వ్యాక్సినేషన్కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసింది.
ఇది ఆర్డర్…
టీకా డ్రైవ్ మూడో దశను క్రమపద్ధతిలో అమలు చేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శులు / ప్రధాన కార్యదర్శులు, యూటీలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. అర్హతగల పౌరులు టీకా సేవలను సజావుగా, సౌకర్యవంతంగా పొందగలిగేలా రాష్ట్రాలు, యూటీల ప్రభుత్వాలు ముందుగానే సన్నాహాలు చేసుకోవాలి అని లేఖలో తెలిపారు. ఈ వ్యాక్సినేషన్లో 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు గల పౌరులను టీకా ఇప్పించే జాబితాలో చేర్చడంతో అర్హత కలిగిన లబ్ధిదారుల సంఖ్య పెరిగిపోగా.. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నందున.. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద రద్దీ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది కేంద్రం. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్తో సంబంధం లేకుండా, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ టీకా కేంద్రాలు కోవిన్ వ్యవస్థలో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసిన కేంద్రం.. అన్ని సీవీసీలు అన్ని టీకాలను రికార్డ్ చేయడం, డిజిటల్ టీకా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం, అన్ని ఏఈఎఫ్ఐ లను నివేదించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.