Corona Vaccine: దేశంలో కరోనా టీకాల కొరత నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు వారి ఇష్టానురీతిలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో డోసు టీకాకు 1,250ల నుండి రూ.1600ల వరకూ మరి కొన్ని చోట్ల రూ.2వేల వరకూ వసూలు చేస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టీకా డోసు ధరలను నిర్ణయించింది. సర్వీస్ చార్జీ కింద రూ.150లు కంటే అధికంగా వసూలు చేయడానికి వీలులేదని కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ వ్యాక్సిన్ కొరత కారణంగా మంద కొడిగా సాగుతోంది. దానికి తోడు ప్రస్తుతం 45 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే టీకాలు ఇస్తున్నారు. ఈ వయసు లోపు వారితో పాటు ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున బారులు తీరుతున్నందున ఆక్కడ క్యూలైన్ లలో వేచి చూడలేని వారు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
ఇప్పటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి ప్రైవేటు ఆసుపత్రులు ఇంత మొత్తమే తీసుకోవాలనే గైడ్ లైన్స్ ఇవ్వకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు వారి ఇష్టాను రీతిలో ధరలను నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకా ధరలను నిర్ణయించింది. కోవిషీల్డ్ ధరను గరిష్టంగా రూ.780లు, కోవాగ్జిన్ డోసుకు రూ.1,410లుగా నిర్ణయించింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ – వీ వ్యాక్సిన్ కు ఒక్కో డోసుకు రూ.1,145లు వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. రూ.150లు సర్వీసు చార్జీతో పాటు జీఎస్టీ పనులు కూడా కలుపుకొని ఈ ధరను నిర్ణయించినట్లు వెల్లడించింది.
Read More: YS Sharmila: కేసిఆర్ సర్కార్ పై మరో సారి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
ప్రైవేటు ఆసుపత్రులు రూ.150లు కంటే ఎక్కువగా సర్వీసు చార్జీలు వసూలు చేయవద్దని పేర్కొంది. ప్రైవేటు ఆసుపత్రులు అంత కంటే ఎక్కువగా వసూలు చేయకుండా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. వ్యాక్సిన్ ధరల విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనీ, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.