Corona Vaccine: కోవిషీల్డ్ టీకా ధరను తగ్గిస్తున్నట్లు పూనెలోని సీరం ఇన్సిట్యూట్ ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ అధినేత అధర్ పూనావాలా ప్రకటించారు. అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే టీకాకు మాత్రమే ధర తగ్గించినట్లు వెల్లడించారు. ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు టీకా డోసు ధర రూ.400 లుగా నిర్ణయించగా దాన్ని రూ.300లకు తగ్గించారు. ప్రైవేటు ఆసుపత్రులకు, వ్యక్తులకు డోసు ధర రూ.600 లు నిర్ణయించారు. దానిలో ఏటువంటి మార్పు చేయలేదు. టీకా ఉత్పత్తిలో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి డోసు ధర రూ.150 లుగా గతంలోనే నిర్ణయించారు.
ఇంతకు ముందు కేంద్రానికి డోసు ధర రూ.150 లు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400 లు నిర్ణయించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ధరలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. టీకా ధరల తగ్గింపునకు ఉత్పత్తికంపెనీలతో మాట్లాడాలని కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో సెరం ఇన్సిట్యూట్ కోవిషీల్డ్ టీకా డోసు ధరను రూ.100 లు తగ్గించింది. టీకా తగ్గింపు ధర నేటి నుండి అమలు అవుతుందని సంస్థ అధినేత పూనావాలా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ధర తగ్గింపు వల్ల ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదా అవ్వడమే కాకుండా మరింత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
మరో పక్క టీకా ధరలు వేరువేరుగా ఉండటంపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగుతోంది. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ వేదికగా టీకా విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశంలో తయారు అవుతున్న కరోనా వ్యాక్సిన్ ను ప్రజల ధనంతోనే తయారు చేస్తున్నారనీ, కానీ అదే ప్రజలకు టీకాను అధిక ధరకు విక్రయిస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మిత్రుల కోసం ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు.