Corona Vaccine: దేశంలో ప్రజలందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ లు వేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి సంస్థల వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు వేగవంతం చేసే పనిలో పడింది. ఆయా సంస్థలు ఎప్పటి నుండో అడుగుతున్న నష్టపరిహార మినహాయింపు ఇవ్వడానికి కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇతర దేశాలు కూడా ఈ మినహాయింపులు ఇచ్చాయని, ఇక్కడ కూడా ఇవ్వడంలో సమస్య ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ సంస్థలు మన దేశంల అత్యవసర వినియోగ అనుమతులకు ధరఖాస్తు చేసుకుంటే నష్టపరిహారం మినహాయింపు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాయి.
అయితే కేంద్రం విదేశీ వ్యాక్సిన్ సంస్థలకు ఆర్థిక, చట్టపరమైన భద్రత కల్పిస్తామని హామీ ఇస్తున్న నేపథ్యంలో దేశీయ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ కూడా అదే డిమాండ్ ను లేవనెత్తుతోంది. తమకు కూడా ఆర్థిక, చట్టపరమైన భద్రత కల్పించాలని కోరుతున్నది. అన్ని సంస్థలకు ఒకే రకమైన నిబంధనలు ఉండాలని సీరం అంటోంది.
ఒక వేళ విదేశీ సంస్థలకు ఆర్థిక, చట్టపరమైన భద్రత కల్పిస్తే సీరం సంస్థతో పాటు ఇతర అన్ని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకూ ఆ భద్రత కల్పించాలని సీరం వర్గాలు డిమాండ్ చేశాయి. టీకాల వల్ల భారత్ లో ప్రతికూల ప్రభావాలు తలెత్తితే చట్టపరమైన చిక్కులతో పాటు ఆర్థిక నష్టపరిహారాల అంశాలకు వాక్సిన్ సంస్థలకు బాధ్యులను చేయబోమంటూ ప్రభుత్వం భద్రత కల్పించాల్సి ఉంటుంది.
దేశంలో వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విదేశీ టీకా సంస్థలకు పలు మినహాయింపులు కల్పించింది. పలు దేశాలలో అనుమతులు పొంది వినియోగిస్తున్న టీకాలను భారత్ లో వినియోగించడానికి మళ్లీ ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం లేదనీ, విడతల వారీగా కేంద్ర ల్యాబ్ లలో చేపట్టాల్సిన పరీక్షల నుండి కూడా మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. విదేశీ సంస్థలతో పాటు స్వదేశీ టీకా సంస్థలు ఆర్థిక, చట్టపరమైన భద్రత కల్పించాలని కోరుతున్న నేపథ్యంలో కేంద్రం ఏలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?