Coronavirus: కొద్ది రోజులుగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతితో భారతదేశంలో కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా రెండున్నర లక్షలకుపైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా పౌరులకు యుఎస్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కొద్ది రోజుల పాటు భారత్ పర్యటనలకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడిసీ) ఒక ప్రకటన విడుదల చేసింది.
వాక్సిన్ తీసుకున్న వారు కూడా వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి ఇండియా పర్యటనలను రద్దు చేసుకోవడం మంచిదని సూచించింది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ముందస్తుగా పూర్తి స్థాయిలో వాక్సిన్ తీసుకోవాలని సీడీసీ పేర్కొంది.
ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిన్ జాన్సన్ భారత్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రభుత్వం భారత్ ప్రయాణాలపై కఠిన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. భారత్ లో కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ దేశాన్ని రెడ్ లిస్ట్ లో పెడుతున్నట్లు ఆరోగ్య మంత్రి మాట్ హాన్ కాక్ తెలిపారు.