దేశ ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినా కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదు అవుతుండటం, కరోనా సెకండ్ వేవ్ అంటూ వార్తలు వస్తుండటంతో వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ల అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 16వ తేదీ నుండి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ప్రధాన మంత్రి మోడీ శనివారం ఉన్నత స్థాయి అధికారుల బృందంతో సమీక్ష అనంతరం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సోమవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.
దేశంలో తొలిదశలో 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్ అందిస్తుంది. ముందుగా కోటి మంది వైద్యసిబ్బందికి, రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వాలియర్స్ కు టీకా అందించనున్నది. తరువాత 50సంవత్సరాలు పైబడిన వృద్ధులు, ప్రాధాన్యతా క్రమంలో అనారోగ్యంతో ఉన్న 27 కోట్ల మందికి టీకా అందిస్తామని కేంద్రం ప్రకటించింది. దేశంలో సంక్రాంతి, లోహ్రి తదితర పండుగల నేపథ్యంలో పండుగ సెలవుల అనంతరం 16వ తేదీ నుండి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని నిర్ణయించింది. వ్యాక్సినేషన్ కోసం ముందుగా దేశ వ్యాప్తంగా డ్రైరన్ నిర్వహించిన విషయం విదితమే.