Covid Vaccine: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవుతున్న వేళ కరోనా వ్యాక్సిన్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ మేరకు ఉత్పత్తి కంపెనీలు టీకాలను అందించలేక పోవడంతో టీకా కొరత ఆందోళన కల్గిస్తోంది. టీకా ఉత్పిత్తిని పెంచి దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా అందించాలంటూ విపక్షాల నుండి కేంద్రంపై ఒత్తిడి వస్తుంది. ఈ నేపథ్యంలో దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు కీలక ప్రకటన చేశాయి. రాబోయే నాలుగు నెలల్లో తమ ఉత్పత్తి సామర్థ్యాల పెంపుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్రానికి తెలియజేశాయి. తమ టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని రానున్న రోజుల్లో గణనీయంగా పెంచుతామని తెలిపాయి. పూణెలోని సీరం ఇన్సిట్యూట్ ఆగస్టు నాటికి తమ ఉత్పత్తిని పది కోట్ల డోసులకు పెంచుతామని తెలియజేయగా, భారత్ బయోటెక్ సంస్థ 7.8 కోట్లకు పెంచుతామని తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరక ఈ సంస్థలు తమ ఉత్పత్తి అంచనా ప్రణాళికను కేంద్రానికి అందించాయి.
టీకా తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటామనీ, ఆగస్టు నాటికి తమ తయారీ సామర్థ్యాన్ని పది కోట్ల డోసులకు పెంచుతామనీ, సెప్టెంబర్ లో అదే స్థాయిలో కొనసాగిస్తామని సీరం ఇన్సిట్యూట్ వివరించింది. అదే విధంగా హైదరాబాద్ కు చెందిన బయోటెక్ కూడా తమ తయారీని జూల నాటికి 3.32 కోట్ల డోసులకు, ఆగస్టు నాటికి 7.82 కోట్ల డోసులకు, సెప్టెంబర్ లోనూ ఇదే స్థాయిలో పెంచుతామని తెలిపింది.
వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు తమ ఉత్పత్తిలో 50 శాతం కేంద్రానికి కేటాయించి మిగిలిన 50 శాతం టీకాలను రాష్ట్రాలకు, ప్రైవేటు హాస్పటల్స్ కు విక్రయించుకోవచ్చని గతంలో కేంద్రం ఆమోదించింది. దీంతో వివిధ రాష్ట్రాలు ఇప్పటికే కంపెనీలకు ఇండెంట్లు పెట్టాయి.