Covishield : దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు గానూ కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టీకా ఉత్పత్తిదారులు 50 శాతం డోసులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, బహిరంగ మార్కెట్ లో విక్రయించుకునేందుకు వీలు కల్పించింది. కేంద్రం ప్రకటించిన ఈ నిర్ణయాన్ని స్వాగతించిన పూణే లోని సీరమ్ ఇనిస్టిట్యూట్ నేడు కోవిషీల్డ్ టీకా విక్రయించే ధరలను ప్రకటించింది. ఒక డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.400లు అని, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600ల అని తెలిపింది. రాబోయే రెండు నెలల్లో టీకా ఉత్పత్తిని పెంచుతామని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ ఉత్పత్తి సామర్థ్యంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి, 50 శాతం రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులకు అందిస్తామని తెలిపింది. విదేశీ టీకాలతో పోలిస్తే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలు అందుబాటులోనే ఉన్నాయన్నారు. అమెరికన్ వ్యాక్సిన్ ధర ఒక డోసు సుమారు రూ.1,500లు ఉందని తెలిపింది. రష్యా, చైనా వ్యాక్సిన్ల ఒక డోసు ధర రూ.750లు ఉందని వివరించింది. నాలుగు అయిదు నెలల తర్వాత రిటైల్ మార్కెట్ లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీరమ్ సంస్థ ఆ ప్రకటనలో తెలియజేసింది.