దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆజాదీ గా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నాము. కానీ ఇంకా దేశంలోని పలు ప్రాంతాల్లో అసమానతలు తొలగిపోలేదు. తాజాగా ఓ పాఠశాలలో అగ్రవర్ణాల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి కుండను తాకాడని ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడంతో ఓ దళిత బాలుడు మృతి చెందిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తొంది. ఈ దారుణ ఘటనపై తొలి దళిత లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వందేళ్ల క్రితం తన తండ్రి దివంగత నేత బాబు జగజ్జీవన్ రామ్ కూ ఇలాంటి పరిస్థితే ఎదురైందనీ.. అయితే అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు.
100 ఏళ్ల క్రితం జరిగిన ఘటన ఇది. స్కూల్ లో అగ్రకులాల వారి కోసం ఏర్పాటు చేసిన ఓ కుండ నుండి నీళ్లు తాగేందుకు ప్రయత్నించిన మా నాన్న బాబు జగ్జీవన్ రామ్ ను కొట్టారు. అదృష్టం బాగుండి ఆ రోజు ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఈ రోజు రాజస్థాన్ లో ఓ దళిత బాలుడిని ఇదే కారణంతో కొట్టి చంపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా .. కుల వ్యవస్థ ఇంకా మనకు ప్రధాన శత్రువుగానే ఉంది. అని మీరా కుమార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే విషయంపై మంగళవారం మీరా కుమార్ ఓ జాతీయ మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ మాట్లాడారు. దళిత వ్యక్తి అయిన తన తండ్రి ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేసుకుని బాధపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడి, ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఇప్పటికీ ఆయనను దళిత నేత అని సంబోధించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని అన్నాడు. లండన్ లో తాను అద్దె ఇల్లు కోసం వెతికిన సందర్భంలో చాలా మంది కుల ప్రస్తావన తీసుకొచ్చి తనకు ఇల్లు ఇవ్వలేదన్న చేదు ఘటనను గుర్తు చేసుకున్నారు.
రాజస్థాన్ లోని జాలోర్ జిల్లా సురానా అనే గ్రామంలో గత నెల 20న ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తొమ్మిది సంవత్సరాల దళిత బాలుడు పాఠశాలలో తాగునీటి కుండలోని నీళ్లు తాగాడు. ఈ విషయం తెలుకున్న స్కూల్ ఉపాధ్యాయడు ఈ విద్యార్ధిని చితకబాదాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 13న ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైందని ఆరోపిస్తూ బారా అత్రు కాంగ్రెస్ ఎమ్మెల్యే పానాచంద్ మేఘ్ వాల్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు మద్దతుగా బారా మున్సిపాలిటీలోని 12 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తాజాగా రాజీనామా లేఖలు సమర్పించారు. మరో పక్క బాలుడి మృతి ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేసును సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.
కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. మ్యాటర్ ఏమిటంటే..?