అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా యత్నించగా, భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు భారత జవాన్లు గాయపడ్డారు. ఈ నెల 9వ తేదీ ఈ ఘటన జరగ్గా నిన్న వెలుగు చూసింది. తవాంగ్ ఘటనపై చర్చ జరపాలంటూ పార్లమెంట్ ఉభయ సభలో విపక్షాలు ఆందోళన చేశాయి. లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ లు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అటు రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని లేవనెత్తారు. విపక్షాల ఆందోళనతో కొద్దిసేపు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అంశంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్ సభలో ప్రకటన చేశారు.
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టర్ లో డిసెంబర్ 9న భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా యత్నించిందనీ, అయితే చైనా సైనికుల ప్రయత్నాలను మన సైనికులు తిప్పికొట్టారని మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనాతో చర్చించామని చెప్పారు. వారు చేసిన పనిపై అభ్యంతరం వ్యక్తం చేశామని తెలిపారు. మన సైనికులు భారత భూభాగాన్ని కాపాడేందుకు సర్వసన్నద్దంగా ఉన్నారని చెప్పారు. ఎవరు ఎలాంటి ప్రయత్నం చేసినా ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఈ స్టాండాఫ్ లో ఇరుదేశాలకు చెందిన కొందరు సైనికులు గాయపడ్డారన్నారు. అయితే ఎవరూ కూడా తీవ్రంగా గాయపడటం గానీ మృతి చెందడం గానీ జరగలేదనే విషయాన్ని సభాముఖంగా చెపుతున్నానని పేర్కొన్నారు. భారత మిలిటరీ కమాండర్లు క్షణాల్లోనే ప్రతిస్పందించడంతో చైనా సైనికులు వారి ప్రాంతానికి వెనుతిరిగి పోయారని తెలిపారు.
మరో వైపు అంతకు ముందు సరిహద్దుల్లో ఘర్షణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..పలువురు సీనియర్ మంత్రులతో చర్చించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా త్రివిధ దళాల ప్రధానాధికారులతో తాజా పరిస్థితులపై చర్చలు జరిపారు.
ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆ సీనియర్ కాంగ్రెస్ నేత అరెస్టు